Train Alarm Chain: రైలులోని ప్రతీ బోగీలో ప్రయాణికుల భద్రత రిత్యా అలారం చైన్ ను రైల్వేశాఖ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిని దుర్వినియోగం చేయడం వల్ల రైళ్ల సమయపాలన దెబ్బతింటోందని భారతీయ రైల్వే ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనవసరంగా చైన్ లాగడం వల్ల ఒక్క రైలు మాత్రమే కాకుండా దాని వెనుక వచ్చే అనేక రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని వ్యాఖ్యానిస్తోంది. ఈ నేపథ్యంలో రైలులో అలారం చైన్ ఎలాంటి పరిస్థితుల్లో వాడాలి? నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్షల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
రైలు బోగీల్లో ఉండే అలారం చైన్లు నేరుగా ప్రధాన బ్రేక్ పైప్లోని ‘వెంట్ వాల్వ్’కు అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా ఈ పైప్లో చదరపు సెంటీమీటర్కు దాదాపు 5 కిలోల గాలి పీడనం (ఎయిర్ ప్రెజర్) ఉంటుంది. ప్రయాణికులు అలారం చైన్ లాగగానే ఈ వాల్వ్ తెరుచుకుని గాలి బయటకు పోతుంది. పీడనం తగ్గడాన్ని లోకో పైలట్ ప్రెజర్ గేజ్ ద్వారా గమనించి రైలును నిలిపివేస్తారు. అయితే గాలి బయటకు వచ్చేటప్పుడు ఆయా బోగీ వద్ద పెద్ద శబ్దం (హిస్సింగ్ సౌండ్) వస్తుంది. దీని ఆధారంగా రైల్వే సిబ్బంది ఏ బోగీలో చైన్ లాగారో గుర్తించేందుకు వీలు కలుగుతుంది. ప్రయాణికుల సమస్యను సరిచేసి చైన్ను మళ్లీ రీసెట్ చేశాకే రైలు ముందుకు కదులుతుంది.
ప్రయాణికుల భద్రతకు ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితుల్లో మాత్రమే చైన్ లాగాలి. రైలు నుంచి ఎవరైనా ప్రయాణికుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయినా, బోగీలో మంటలు చెలరేగినా, తీవ్రమైన నేరాలు, భద్రతా సమస్యలు తలెత్తినా చైన్ ఉపయోగించవచ్చు. అలాగే వెంటనే వైద్య సహాయం అందించాల్సిన అత్యవసర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. అంతేగానీ దిగాల్సిన స్టేషన్ దాటిపోయినా, పొరపాటున వేరే రైలు ఎక్కినా, చుట్టాలు లేదా స్నేహితులు రైలు ఎక్కడం ఆలస్యమైనా చైన్ లాగడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
రైల్వే చట్టం 1899లోని సెక్షన్ 141 ప్రకారం తగిన కారణం లేకుండా అలారం చైన్ లాగి రైలుకు అంతరాయం కలిగించడం శిక్షార్హమైన నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ.1,000 వరకు జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రయాణికుడు మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే కనీసం రూ. 500 జరిమానా విధిస్తారు. రెండోసారి లేదా ఆ తర్వాత కూడా ఇదే తప్పు పునరావృతం చేస్తే కనీసం మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా, 2026 జనవరి నుండి ఆగస్టు మధ్య ఒక్క ఆగ్రా, ఝాన్సీ, ప్రయాగ్రాజ్ డివిజన్లలోనే 6,393 అలారం చైన్ లాగిన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 6,379 మందిని అరెస్టు చేసి రూ.16.63 లక్షల జరిమానా వసూలు చేశారు.
Also Read: ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!
అలారం చైన్ అవసరం పడకుండా ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైల్వే శాఖ సూచిస్తోంది. ప్రయాణికులు ఎల్లప్పుడూ నిర్ణీత సమయానికంటే ముందే స్టేషన్కు చేరుకుని తమ కోచ్ వివరాలను సరి చూసుకుని రైలు ఎక్కాలని విజ్ఞప్తి చేస్తోంది. ఒకవేళ స్టేషన్ మిస్ అయినా లేదా పొరపాటున వేరే రైలు ఎక్కినా తదుపరి స్టేషన్ వరకు వేచి చూసి అక్కడ దిగి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హితవు పలుకుతోంది. అంతేగానీ కదులుతున్న రైళ్లను అలారం చైన్ తో ఆపేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేస్తోంది.
Also Read: రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?