భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు, ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సరికొత్త విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రయాణీకుల భద్రత, రైలులోని ఆహార నాణ్యతను మెరుగుపరిచేందుకు కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. భారతీయ రైల్వే ఆథరైజ్డ్ క్యాటరింగ్ సిబ్బంది కోసం క్యూఆర్ కోడ్ తో కూడిన గుర్తింపు కార్డులను, డిజిటల్ గా గర్తించే ఫుడ్ ప్యాక్ లను ప్రవేశపెట్టింది. అనధికార అమ్మకాలను నిర్మూలించడం, రైళ్లలో ధృవీకరించబడిన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
రైల్వే చట్టం, 1989లోని సెక్షన్ 144 ప్రకారం రైళ్లలో అనధికారికంగా వస్తువులను అమ్మడం నిషేధం. ఇది శిక్షార్హమైన నేరం. దీనిని అమలు చేయడానికి, అక్రమ విక్రేతలు రైళ్లు, స్టేషన్ ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి రైల్వే అధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు భారతీయ రైల్వే, ఐఆర్సిటిసి కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నాయి.
కొత్త విధానంలో భాగంగా విక్రేతలు, రైలులోని సిబ్బందితో సహా అధీకృత క్యాటరింగ్ సిబ్బంది అందరూ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉన్న గుర్తింపు కార్డులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ కార్డులు సిబ్బంది పేరు, ఆధార్ వివరాలు, పోలీసు వెరిఫికేషన్ స్టేటస్ లాంటి వివరాలను రియల్ టైమ్ లో కన్ఫార్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా ఆథరైజ్డ్ సిబ్బంది మాత్రమే ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారని నిర్థించుకునే అవకాశం ఉంటుంది.
అటు అటు రైల్వే ఫుడ్ ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ను ప్రింట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు, అధికారులు.. ఆహారం అందించిన కిచెన్, తయారీ తేదీ లాంటి వివరాలను ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో రైలులోని క్యాటరింగ్ లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి.
ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి, భారతీయ రైల్వే క్యాటరింగ్ మౌలిక సదుపాయాలను, పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేసింది. ఇప్పుడు భోజనాన్ని నిర్దేశిత బేస్ కిచెన్ల నుంచి సరఫరా చేస్తున్నారు. వీటిలో కిచెన్లను ఆధునీకరించి, ఆహార తయారీ ప్రక్రియలను పర్యవేక్షించడానికి సీసీటీవీ నిఘాతో రెడీ చేశారు. వంట నూనె, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, మసాలా దినుసులతో సహా ప్రామాణికమైన, బ్రాండెడ్ ముడి పదార్థాల వాడకాన్ని కూడా తప్పనిసరి చేశారు.
అటు బేస్ కిచెన్లలో ప్రత్యేక ఆహార భద్రతా పర్యవేక్షకులను నియమించారు. రైళ్లలోని సేవలను ఐఆర్సీటీసీ పర్యవేక్షకులు పర్యవేక్షిస్తారు. పరిశుభ్రత ప్రమాణాలను పాటించేందుకు, బేస్ కిచెన్లు, ప్యాంట్రీ కార్లు రెండింటిలోనూ క్రమం తప్పకుండా శుభ్రత, కీటక నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా ఆహార భద్రతా నిబంధనల అమలును కఠినతరం చేశారు. ఇందులో భాగంగా అన్ని క్యాటరింగ్ యూనిట్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ధృవీకరణ తప్పనిసరి చేశారు.
Read Also: ప్రపంచంలో అత్యంత పొడవైన బీచ్ లు ఇవే, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!