Indian Railways: రైల్వే స్టేషన్లలో జరుగుతున్న తొక్కిసలాటలను నిరోధించేందుకు రైల్వేశాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్ ఫారమ్ ల మీద రద్దీని కంట్రోల్ చేసేందుకు కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా టికెట్ లేకుండా రైళ్లు ఎక్కే వారిని కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలని భావిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ఎంట్రీ
దేశ వ్యాప్తంగా ప్రతి రోజు 12 వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. వందలాది రూట్ల ద్వారా లక్షలాది మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. చాలా మంది ప్రయాణీకులు ముందుగానే తమ టికెట్లను బుక్ చేసుకుంటారు. అయితే, రద్దీ సమయాల్లో కన్ఫర్మ్ టికెట్ లేని వాళ్లు కూడా రైలు ఎక్కడంతో, కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది టికెట్లు లేకుండానే రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. వీరి వల్ల టికెట్ కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. కుంభమేళా సమయంలో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ఏకంగా రైళ్ల కిటికీలు, డోర్లు ధ్వంసం చేసి మరీ చాలా మంది రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కారు. మరికొన్ని రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో రైల్వే స్టేషన్లలో తొక్కిసలాటకు తావులేకుండా రైల్వేశాఖ చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే స్టేషన్ లోకి అడుగు పెట్టేందుకు అనుమతిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 60 రైల్వే స్టేషన్లలో అమలు
దేశ వ్యాప్తంగా ఉన్న 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఇకపై కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే అనుమతించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రద్దీని నివారించడంతో పాటు ప్రయాణీకుల భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విధానం న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా స్టేషన్లలో అమలు అవుతోంది. ఇకపై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (ముంబై), హౌరా జంక్షన్ (కోల్కతా), చెన్నై సెంట్రల్ (చెన్నై), బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ (బెంగళూరు) సహా అత్యంత రద్దీగా ఉండే 60 రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.
Read Also: ఏపీ నుంచి యూపీకి మూడేళ్ల జర్నీ.. అత్యంత ఆలస్యమైన రైలుపై PIB ఆసక్తిర వ్యాఖ్యలు!
ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినప్పటికీ..
రైల్వేశాఖ తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా ప్రారంభంలో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కానీ, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇకపై వీలైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దేశంలోని 60 ప్రధాన రైల్వే స్టేషన్ల వెలుపల శాశ్వత వెయిటింగ్ ఏరియాను నిర్మించాలని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అక్కడి నుంచి టికెట్ ఉన్న వాళ్లనే ప్లాట్ ఫారమ్ మీదికి అనుమతించనున్నట్లు వెల్లడించారు.
Read Also: దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయంటే?