Indian Railways Train Ticket Subsidy: భారతీయ రైల్వే సంస్థ ఆదాయాన్ని పెంచుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే అవసరం లేని ప్రయాణీకులు రైలు టికెట్లపై సబ్సిడీని వదులకుకోవాని కోరుతున్నది. ఇందుకోసం ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అవసరం లేని వాళ్లు టికెట్ల మీద అందించే సబ్సిడీని వదులుకోవాలని ఇప్పటికే ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రయాణీకులు రైల్వే టికెట్ పై సబ్సిడీని వదులుకుంటున్నారు.
ప్రతి రైలు టికెట్ పై 47 శాతం సబ్సిడీ అందిస్తున్న కేంద్రం
రైల్వే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ అందిస్తున్నది. ప్రతి టికెట్ మీద 47 శాంత సబ్సిడీ అందిస్తున్నది. ప్రయాణీకుల నుంచి 53 శాతం డబ్బు వసూలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) సిలిండర్లపై సబ్సిడీని వదులు కోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లుగానే, రైలు టిక్కెట్లపై సబ్సిడీని వదులుకోవాలని ప్రయాణీకులను కోరింది. ప్రయాణీకులు రైలు టికెట్ ను సబ్సిడీతో లేదంటే, సబ్సిడీ లేకుండా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సబ్సిడీని వదులుకునే వారు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
IRCTCలో కీలక మార్పులు
సబ్సిడీ వదులుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్(IRCTC) వెబ్ సైట్ లో అవసరమైన మార్పులను చేసింది. సబ్సిడీతో పాటు సబ్సిడీ లేకుండా టికెట్ కొనుగోలు చేసే ఎంపికను అందిస్తుంది. ఇకపై టికెట్లు బుక్ చేసుకునే సమయంలో సబ్సిడీ వద్దు అనుకునే వాళ్లు ‘గివ్ ఇట్ అప్’ ఆప్షన్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన వాళ్లు యథావిధిగా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
‘గివ్ ఇట్ అప్’తో రూ. 10 వేల కోట్ల ఆదాయం
రైల్వే నివేదికల ప్రకారం భారతీయ రైల్వే సంస్థ టికెట్లను విక్రయించడం ద్వారా ఏటా రూ. 60 వేల కోట్లు ఆదాయాన్ని పొందుతున్నది. ‘గివ్ ఇట్ అప్’ పథకం ద్వారా సుమారు రూ. 10 వేల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ పథకం మీద రైల్వేశాఖ ఆలోచన చేసినా, కొన్ని కారణాలతో దాన్ని అమలు చేయలేదు. కానీ, ప్రధాని మోడీ పిలుపునివ్వడంతో ప్రజలు స్వచ్ఛందంగా తమ రైలు టికెట్ మీద సబ్సిడీని వదులుకునేందుకు ముందుకు వచ్చారు. తొలుత గ్యాస్ మీద సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని మోడీ కోరగా, ఆ తర్వాత రైల్వే టికెట్ల మీద సబ్సిడీ వదులుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ప్రధాని మోడీ విజ్ఞప్తి మేరకు ఏకంగా కోటిన్నర మంది తమ టికెట్లపై సబ్సిడీ వదులుకునేందుకు ముందుకు వచ్చారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బుతో రైల్వే సేవలను మరింత మెరుగుపరచనున్నట్లు వెల్లడించారు.