Qadian-Beas Rail Link: ప్రస్తుతం దేశంలో రైల్వే లైన్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఏ ప్రాజెక్టు అయినా, ఇన్ టైమ్ లో పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్లకు రైల్వేశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇస్తోంది. అయినప్పటికీ కొన్ని చోట్ల కాస్త ఆలస్యం అయిన సందర్భాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా ఆ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, దేశంలో ఓ రైల్వే ప్రాజెక్టుకు బ్రిటిషర్ల కాలంలో పునాది పడింది. ఇప్పటికీ, ఆ పనులు పూర్తి కాలేదు. ఎప్పుడెప్పుడు ఆ రైల్వే లైన్ పూర్తి అవుతుందా? అని అక్కడి ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ, ఆ రైల్వే లైన్ ఏది? ఎందుకు ఆ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదంటే?
ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని ఖాడియాన్ -బియాస్ రైల్వే లింక్
ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని రైల్వే ప్రాజెక్టు పంజాబ్ గురుదాస్ పూర్ లోని ఖాడియాన్ -బియాస్ రైల్వే లింక్. సుమారు 40 కిలో మీటర్ల పొడవు ఉండే ఈ పనులను బ్రిటిష్ కాలంలో ప్రారంభించారు. సుమారు 100 ఏండ్లు గడుస్తున్నా, ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రతాప్ సింగ్ బజ్వా లాంటి నాయకులు ఈ రైల్వే లింక్ పూర్తి చేయాలని ఎన్నిసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా సక్సెస్ కాలేకపోయారు. గురుదాస్పూర్ మాజీ ఎంపీ, సినీ దిగ్గజం వినోద్ ఖన్నా కూడా రైల్వే మంత్రిత్వ శాఖను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ, పూర్తి చేయించలేకపోయారు.
ఎందుకు ఈ రైల్వే లింక్ పూర్తి కావడం లేదంటే?
నిజానికి ఈ రైల్వే లింక్ పూర్తి అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఖాడియాన్ అహ్మదీయ ముస్లింల అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఈ రైల్వే లైన్ పూర్తి అయితే ఈ ప్రాంత పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మెరుగైన రాకపోకలు స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సమీపంలోని బటాలాలో అనారోగ్య, పారిశ్రామిక యూనిట్లను పునరుద్ధరించే అవకాశం కూడా ఉంటుంది.
అకాలీ దళ్ అందోళనలే కారణం
2010లో ప్రజల డిమాండ్ మేరకు, అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీని.. గురుదాస్ పూర్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందిగా కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ తొలగించగలిగారు. చివరికి రైల్వేశాఖ సామాజిక ప్రాజెక్టులో భాగంగా మంజూరు చేయాలనుకుంది. ఆ సమయంలో పంజాబ్ లో శిరోమని అకాలీదళ్ అధికారంలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, బజ్వాకు ఎక్కడ క్రెడిట్ వస్తుందోననే ఉద్దేశంతో ఈ రైల్వే లింక్ కు వ్యతిరేకంగా నిరసనలు మొదలు పెట్టారు. సేకరించాల్సిన భూమికి రైతులకు తగిన పరిహారం అందడం లేదని ఆందోళన మొదలుపెట్టారు. ఎన్ని ఆందోళనలు జరిగిన బజ్వా ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘ఫైనల్ లొకేషన్ సర్వే’ జరిగేలా ప్రయత్నించారు. కానీ, మళ్లీ అకాలీ దళ్ మంత్రి రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారు. చివరికి ఈ ప్రాజెక్టు కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లింది. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రధాని మోడీతో పాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరుతున్నారు ప్రతాప్ సింగ్ బజ్వా.
Read Also: విశాఖ నుంచి నేరుగా ఆ దేశానికి విమానాలు.. ఇక ఆ సమస్య లేనట్లే!