Indian Railways: భారతీయ రైల్వే సంస్థ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోజు రోజుకు మరింత పురోగతి సాధిస్తున్నది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, ఇకపై హైడ్రోజన్ రైళ్లు పట్టాలు ఎక్కబోతున్నాయి. కాలుష్య రహిత రైల్వే వ్యవస్థను రూపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ రైళ్లు పర్యావరణ అనుకూల ప్రయాణంలో కొత్త మైల్ స్టోన్ గా నిలువబోతోంది. దేశ వ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నది. ఇందుకోసం గత ఏడాది ఏకంగా రూ. 2,800 కోట్లు కేటాయించింది. ఒక్కో హైడ్రోజన్ రైలు అంచనా వ్యయం రూ. 80 కోట్ల వరకు ఉంటుందని రైల్వే సంస్థ వెల్లడించింది.
మార్చి 31న తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం!
ఇప్పటికే రెడీ అయిన తొలి హైడ్రోజన్ రైలును ఈ నెల 31న ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలో తన సేవలను అందించనుంది. జింద్- సోనిపట్ పరిధిలోని 90 కిలో మీటర్ల పరిధిలో ఈ రైలు నడవనుంది. పలు పర్యాటక ప్రదేశాల్లోనూ ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాని అధికారులు భావిస్తున్నారు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వే, మాథేరన్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే, బిలిమోరా-వాఘై రైల్వే, మార్వార్-దియోగర్ మదరియా మార్గాల్లోనూ ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
అత్యంత శక్తివంతమైన ఇంజిన్
భారత్ లో పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ రైలు పూర్తి స్థాయి స్వదేశీ టెక్నాలజీతో రూపొందింది. ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైడ్రోజన్ రైలు ఇంజినట్లతో పోల్చితే.. భారత హైడ్రోజన్ రైలు ఇంజిన్ అత్యంత పవర్ ఫుల్ గా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దేశాలు హైడ్రోజన్ రైలు ఇంజిన్లను తయారు చేస్తున్నాయి. వాటి సామర్థ్యం 500 నుంచి 600 HP ఉంటుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో భారత్ హైడ్రోజన్ రైల్వే ఇంజిన్లు 1,200 HP సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నాయి. ప్రపంచంలో ఇంత సామర్ధ్యంతో ఎక్కడా హైడ్రోజన్ ఇంజిన్లు తయారు కావడం లేదు. ఈ రైళ్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) అభివృద్ధి చేయగా, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో హైడ్రోజన్ రైళ్లు తయారవుతున్నాయి. ఈ రైళ్లు ప్రపంచంలోనే అతి పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఉండనుంది.
Read Also: దేశంలో పట్టాలెక్కిన తొలి రైలు ఇదే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందంటే?
హైడ్రోజన్ రైళ్లతో కలిగే లాభాలు
హైడ్రోజన్ తో నడిచే రైళ్లను హైడ్రాలిక్స్ అని కూడా పిలుస్తారు. సాంప్రదాయ డీజిల్ ఆధారిత లోకోమోటివ్లతో పోల్చితే ఈ రైళ్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రైళ్లు ఎలాంటి కర్బన ఉద్గారాలను వెదజల్లవు. ఎలాంటి పొల్యూషన్ ఉండదు. హైడ్రోజన్ విరివిగా లభిస్తున్న నేపథ్యంలో కొరత అనేది ఉండదు. హైడ్రోజన్ రైళ్లు డీజిల్ కౌంటర్ పార్ట్ లతో పోలిస్తే ఎలాంటి శబ్దం లేకుండా అత్యంత సమర్థవంతంగా పని చేస్తాయి.
Read Also: ఆవిరి రైలు ఇంజిన్ల నుంచి అత్యాధునిక వందేభారత్ వరకు.. భారతీయ రైల్వే కళ్లు చెదిరే అభివృద్ధి!