Indian Railways: ప్రయాణికుల భద్రత, పారదర్శకమైన సేవలు అందించడానికి భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే నార్త్ సెంట్రల్ రైల్వే (NCR) కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో టికెట్ తనిఖీ చేసే సిబ్బంది (టీసీలు)కి బాడీ కెమెరాలను అందించేందుకు సిద్ధమైంది. దీనివల్ల టికెట్ తనిఖీ ప్రక్రియలో జవాబుదారీతనం పెరుగుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
టీసీలకు బాడీ కెమెరాలను అమర్చే నూతన విధానాన్ని ముందుగా ప్రయాగ్ రాజ్ – న్యూదిల్లీ మధ్య తిరిగే రైళ్లల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని ఉత్తర మధ్య రైల్వే నిర్ణయించింది. దీనిపై రైల్వేశాఖ ప్రతినిధి డా. శివమ్ శర్మ మాట్లాడుతూ.. ప్రయాణికుల టికెట్ ను చెక్ చేసే ప్రక్రియను ఆడియో, వీడియోల రూపంలో రికార్డ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తద్వారా టికెట్ల చెకింగ్ జవాబుదారి తనాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.
టీసీలకు ఇచ్చే బాడీ కెమెరాలు.. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉండనున్నట్లు శివమ్ శర్మ తెలిపారు. ఇవి పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా రికార్డు చేయగలవని పేర్కొన్నారు. సుదీర్ఘ ప్రయాణాల్లో అంతరాయం కలగకుండా దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ను వీటిని అందించనున్నట్లు చెప్పారు. వాటిలో రికార్డు అయిన ఆడియో, వీడియో దృశ్యాలను ఎవరూ డిలీట్ చేయడానికి, మార్చడానికి వీలులేకుండా ‘ట్యాంపర్ ప్రూఫ్’ సాంకేతికతను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
కాగా, టికెట్ తనిఖీ సమయంలో తరచూ ప్రయాణికులకు, టీసీలకు మధ్య చిన్నపాటి వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమయాల్లో ఎవరి తప్పు ఉందో తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారుతోంది. కాబట్టి బాడీ కెమెరాలను టీసీలకు ఇవ్వడంవ ల్ల.. తప్పు ఎవరిదో ఆధారాలతో సహా కనిపెట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ప్రయాణికులు లేదా టీసీలపై జరిగే అసభ్య ప్రవర్తన, దాడులు, తప్పుడు ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి వీలవుతుంది.
Also Read: స్పేస్లోకి వెళ్లిన భారతీయ ఫుడ్ ఏంటో తెలుసా? శుభాంశు శుక్లా పంచుకున్న స్పెషల్ సీక్రెట్స్!
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కింద.. 30 బాడీ కెమెరాలను కొనుగోలు చేసి, వాటిని ఎలా ఉపయోగించాలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రయాగ్రాజ్ డివిజన్ పరిధిలోని రెండు ముఖ్యమైన రైళ్లలో దీనిని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించనున్నారు. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ (12417/12418), శ్రమ్ శక్తి ఎక్స్ప్రెస్ (12451/12452) రైళ్లలో ఈ బాడీ కెమెరా పనితీరు పరీక్షించి.. భవిష్యత్తులో మిగిలిన రైళ్లకు సైతం విస్తరించేలా నార్త్ సెంట్రల్ రైల్వే కసరత్తు చేస్తోంది. దీని ద్వారా రైల్వే తనిఖీ వ్యవస్థ మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా మారుతుందని భావిస్తున్నారు.
Also Read:రైళ్లలో సీట్ల కొరత తీరినట్లే.. త్వరలో 17,000 కొత్త జనరల్, స్లీపర్ కోచ్లు!