Indian Railways: భారతీయ రైల్వే.. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణం చేసేలా సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది. తాజాగా సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, వికలాంగులకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా చక్కటి నిర్ణయం తీసుకుంది. లోయర్ బెర్తుల విషయంలో వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది.
లోయర్ బెర్తుల కేటాయింపులో వారికి ప్రాధాన్యత
తాజాగా బెర్తుల కేటాయింపుకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే సంస్థ వెల్లడించింది. లోయర్ బెర్త్ లను రిజర్వ్ చేసుకోవడంలో సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీలతో పాటు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రయాణ సమయంలో లోయర్ బెర్త్ లు ఖాళీగా ఉంటే, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, గర్భిణీలకు ప్రాధాన్యత ఇస్తారు. వారికి మొదట్లో మిడిల్ బెర్త్ లు, అప్పర్ బెర్త్ లు కేటాయించబడినప్పటికీ లోయర్ బెర్త్ లలో ప్రయాణించే అవకాశం కల్పిస్తారు.
ఏ రైళ్లలో ఈ విధానం అందుబాటులో ఉంటుందంటే?
లోయర్ బెర్త్ కేటాయింపు నిబంధన పలు రైళ్లలో ఉంటుందని భారతీయ రైల్వే వెల్లడించింది. రాజధాని, శతాబ్దితో పాటు అన్ని మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రత్యేక రిజర్వేషన్ కోటా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ నిర్ణయం వైకల్యం ఉన్న వ్యక్తులను కూడా కవర్ చేస్తుంది.
భారతీయ రైళ్లలో ప్రతి కోచ్ లో నిర్ణీత సంఖ్యలో లోయర్ బెర్తులు ఉంటాయి. స్లీపర్ క్లాస్ లో కోచ్ కు 6 నుంచి 7 లోయర్ బెర్త్ లు ఉంటాయి. ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ (3AC)లో కోచ్ కు 4 నుండి 5 లోయర్ బెర్త్ లు ఉంటాయి. ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ (2AC)లో కోచ్ కు 3 నుండి 4 లోయర్ బెర్త్ లు ఉంటాయి. రైలులోని కోచ్ ల సంఖ్యను బట్టి ఈ నిబంధనలు అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ క్లాస్ లో 4 బెర్తులు 2 లో బెర్తులు వృద్ధులు, గర్భిణీలు, వికలాంగులకు రిజర్వ్ చేయబడ్డాయి. 3AC, 3E క్లాసులలో కూడా ఇలాంటి సదుపాయాలు కల్పించబడ్డాయి. అదనంగా, రిజర్వ్డ్ సెకండ్ సిట్టింగ్ (2S), ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ (CC)లో 4 సీట్లు కూడా దివ్యాంగ ప్రయాణీకుల కోసం అందుబాటులో ఉన్నాయి.
Read Also: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, విశాఖ, విజయవాడ మెట్రో ప్లాన్ కు నిధులు మంజూరు!
మహిళలకు ప్రత్యేకంగా సీటు రిజర్వ్
సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం ఇప్పటికే రైల్వే ప్రత్యేక బెర్త్ లను కేయటాంచింది. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్ లోని మహిళలకు ఆరు బెర్త్ లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజధాని ఎక్స్ ప్రెస్, గరీబ్ రథ్, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ క్లాస్ లో ఆరు బెర్త్ లు మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించారు. భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభాన్ని అందించేందుకు తీసుకుంటున్న చొరవ నిజంగా అభినందనీయం అంటున్నారు.
Read Also: విశాఖ రైళ్లకు సికింద్రాబాద్ లో నో హాల్టింగ్, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!