Hydrogen Train Trial Run: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత అధునాతన హైడ్రోజన్ రైలును తయారు చేస్తున్నది. ఈ రైలు ఎలాంటి కర్బన ఉద్గారాలను విడుదల చేయకుండా గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ రంగంలో కీలక మలుపుకాబోతున్నది. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాకర్టీలో తయారవుతోంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఇవాళ్టి నుంచి ట్రయల్ రన్ జరుపుకోబోతున్నట్లు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. హర్యానాలోని జింద్- సోనిపట్ మార్గంలో సుమారు 90 కిలో మీటర్ల పరిధిలో ఈ రైలు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు రాసేశాయి. ఈ వార్తలపై రైల్వే అధికారులు స్పందించారు. ఇంతకీ వాళ్లు ఏం చెప్పారంటే..
హైడ్రోజన్ రైలు ట్రయల్స్ పై అధికారుల వివరణ
హైడ్రోజన్ రైలు ట్రయల్స్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే సీనియర్ అధికారులు స్పందించారు. ఈ వార్తలు అన్నీ అవాస్తవాలేనని వెల్లడించారు. “మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలు అవాస్తవం. ఇవాళ హైడ్రోజన్ రైలు ట్రయల్స్ ప్లాన్ చేయలేదు. ఇంకా ఆ రైలు తయారీ దశలోనే ఉంది” అని వివరించారు. సో, ఈ వార్తలన్నీ జస్ట్ ఊహాగానాలుగా అధికారులు కొట్టిపారేశారు.
గంటకు 110 కి. మీ వేగంతో..
భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు గంటకు 110 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. ఈ రైలు ప్రపంచంలో అత్యంత సామర్థ్యంతో అంటే 1,200 హార్స్ పవర్ ఇంజిన్ తో పని చేస్తుంది. ఒకేసారి 2,638 మంది ప్రయాణీకులను తీసుకెళ్లే శక్తి ఉంటుంది. దేశంలో కర్బన ఉద్గారాలను జీరోకు పరిమితం చేసేందుకు 35 హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఆధారిత రైళ్లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.2,800 కోట్లు కేటాయించింది. 2030 నాటికి కర్బన ఉద్గారాలు లేని రైల్వే ప్రయాణాన్ని సాధించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. .
హెరిటేజ్ మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లు
హైడ్రోజన్ రైళ్లను హెరిటేజ్ రైల్వే మార్గాల్లో నడిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ ప్రాజెక్ట్ కింద.. వారసత్వ, పర్వత మార్గాల్లో 35 హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ రైళ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 600 కోట్లు కేటాయించింది. ఈ నిధుల ద్వారా హైడ్రోజన్ తయారీ, రైళ్లకు సజావుగా అందించే ఏర్పాట్లు చేయనున్నారు.
Read Also: అడ్వాన్స్ డ్ బుకింగ్ 60 రోజులకు కుదింపు.. పెరుగుతున్న వెయిటింగ్ లిస్ట్, కారణం ఏంటంటే?
పర్యవరణ హితమైన రైల్వే ప్రయాణం
హైడ్రోజన్ రైళ్లు ప్యూయెల్ సెల్స్ ఆధారంగా నడుస్తాయి. ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ నీరు, వేడిని మాత్రమే విడుదల చేస్తాయి. డీజిల్ తో నడిచే లోకోమోటివ్ లకు ప్రత్యామ్నాయంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలు ధర రూ. 80 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే జర్మనీ, చైనా, UKలో ఈ రైళ్లు నడుస్తుండగా, ఇప్పుడు భారత్ వాటి సరసన చేరబోతోంది.
Read Also: ట్రైన్ టాయిలెట్స్లో నీళ్లు రాకపోతే రైల్వే మనకు డబ్బులు చెల్లిస్తుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Read Also: హైదరాబాద్ నుంచి మనాలి టూర్ ప్లాన్ చేస్తున్నారా? జస్ట్ రూ. 12 వేలలో వెళ్లి రావచ్చు తెలుసా?