Last Railway Station in India: భారతీయ రైల్వే సంస్థ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోట్లాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదు, ఎన్నో విశేషాలను కలిగి ఉంది. అలాంటి వాటిలో ఒకటి దేశంలోనే చిట్ట చివరి రైల్వే స్టేషన్. ఇది భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న సింగాబాద్ రైల్వే స్టేషన్. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లా సింగాబాద్ లో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ తర్వాత భారత భూభాగం పూర్తవుతుంది. బంగ్లాదేశ్ సరిహద్దు మొదలవుతుంది.
గొప్ప చరిత్రకు నిదర్శనం సింగాబాద్ రైల్వే స్టేషన్
సింగాబాద్ రైల్వే స్టేషన్ గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఆంగ్లేయుల కాలంలో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలకు ఈ రైల్వే స్టేషన్ కీలక పాత్ర పోషించింది. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఈ స్టేషన్ మీదుగా మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప నాయకులు ఢాకాకు వెళ్లేవారు. అక్కడ దేశ స్వాతంత్ర్యం కోసం చేపట్టాల్సిన ఉద్యమాల గురించి చర్చించే వారు. పలు విదేశీ నాయకులను కలిసి సమాలోచనలు జరిపేవారు. వాటికి ఈ రైల్వే స్టేషన్ ఎంతగానో ఉపయోగపడేది.
కేవలం గూడ్స్ రైళ్ల సేవలు
ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ లో కార్యకలాపాలు అంతగా లేవు. ఈ స్టేషన్ లో ఏ ప్యాసెంజర్ రైళ్లు ఆగడం లేదు. కేవలం కొన్ని గూడ్స్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ కు కొన్ని గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. కేవలం వ్యాపార కార్యకలాపాల కోసమే ఈ రైల్వే స్టేషన్ ను ఉపయోగిస్తున్నారు.
బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత అభివృద్ధి
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి మొదలుకొని, 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన తర్వాత వరకు సింగాబాద్ రైల్వే స్టేషన్ బాగా అభివృద్ధి చెదింది. భారత్-బంగ్లాదేశ్ నడుమ ప్రయాణీలకు, వస్తువుల రవాణాకు ఈ స్టేషన్ ఎంతో ఉపయోగపడింది. 1978లో సింగాబాద్ నుంచి సరకు రవాణా రైళ్లను నడపడానికి ఇరు దేశాల నడుమ ఒప్పందం కూడా జరిగింది. 2011 నుంచి నేపాల్ వరకు సరుకుల రవాణాకు ఈ స్టేషన్ ను ఉపయోగించారు. బంగ్లాదేశ్, నేపాల్ నుంచి భారత్ కు, భారత్ నుంచి ఆ రెండు దేశాలకు ఇక్కడి నుంచే సరుకులను రవాణా చేసే వాళ్లు. ప్రముఖ రవాణా కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత ఈ స్టేషన్ వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ప్రయాణీకుల కోసం ఏ రైలూ ఆగడం లేదు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారమ్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తాయి. ఈ స్టేషన్ లో కొద్ది మంది మాత్రమే రైల్వే సిబ్బంది ఉంటారు. వారు కూడా కేవలం గూడ్స్ రైళ్లను పర్యవేక్షిస్తుంటారు. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగు వెలిగిన ఇప్పుడు మూగబోడంపై ఈ స్టేషన్ తో అనుబంధం ఉన్న పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రైలు కూతలో ఇన్ని రకాలున్నాయా? ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?