IndiGo Flights Cancellation Chaos: వందలాది విమానాలను రద్దు చేసి, ప్రయాణీకుల ఇబ్బదులకు కారణం అయిన ఇండిగో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ పూర్తి ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సంక్షోభానికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇండిగో సేవల అంతరాయంపై కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విమాన పైలట్-రోస్టరింగ్ సమస్యల కారణంగా పెద్ద ఎత్తున విమానాల రద్దుకు దారితీయడంతో.. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా సుమారు 2 వేలకు పైగా విమానా సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ఇండిగో విమానాలు 12 గంటలకు పైగా ఆలస్యం అయ్యాయి. ఎయిర్ పోర్టులలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన కేంద్రం.. వీలైనంత త్వరగా విమాన సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. శనివారం (డిసెంబర్ 6, 2025) నాటికి విమాన షెడ్యూల్స్ యథావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు విమానయాన శాఖ వెల్లడించింది.
గంటల వ్యవధిలో విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని ఇండిగోను కేంద్రం ఆదేశించింది. “అన్ని విమాన షెడ్యూల్స్ ఇవాళ అర్ధరాత్రి వరకు సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు ప్రారంభం అవుతాయి. పూర్తి సేవలు మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. ప్రయాణీకులు తమ విమాన ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ఇంటి నుంచే ట్రాక్ చేసుకోవచ్చు. విమానాలు రద్దు అయితే, ఇండిగో టికెట్లపై ఆటోమేటిక్ గా పూర్తి రీఫండ్ అందిస్తుంది” అని కేంద్రం వెల్లడించింది.
“ప్రయాణీకులు ఎయిర్ పోర్టులలో చిక్కుకుపోతే, ఆయా విమానయాన సంస్థలు హోటళ్లలో వసతి కల్పిస్తాయి. సీనియర్ సిటిజన్లు ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి. వారికి లాంజ్ యాక్సెస్ అందించబడుతుంది. ఆలస్యమైన విమానాల ప్రయాణీకులకు రిఫ్రెష్మెంట్స్, ఇతర అవసరాలు అందించబడతాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 24×7 కంట్రోల్ రూమ్ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది” అని వివరించింది.
ఇండిగో విమాన సర్వీసుల అంతరాయంపై, 24×7 కంట్రోల్ రూమ్ (011-24610843, 011-24693963, 096503-91859) ను ఏర్పాటు చేసింది. ఇది రియల్ టైమ్ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. సమస్యలు తలెత్తినప్పుడు తక్షణ పరిష్కారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్(FDTL) నిబంధనలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించడంతో పాటు ప్రయాణీకుల ఇబ్బందులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతరాయాలను తగ్గించడంలో సహాయపడటానికి నిర్దిష్ట సిబ్బంది డ్యూటీ రూల్స్ నుంచి ఒకేసారి తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల అసౌకర్యానికి ఇండిగో ప్రధానంగా బాధ్యత వహిస్తున్నప్పటికీ, ముఖ్యమైన విమాన సేవల కొనసాగింపునకు మినహాయింపు మంజూరు చేయబడుతుందని DGCA ప్రకటించింది. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పింది. భద్రత విషయంలో రాజీపడితే మినహాయింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.
Read Also: ఇండిగో ఇబ్బందుల దృష్ట్యా DGCA కీలక నిర్ణయం.. ఆ నిబంధనల్లో మార్పులు!