IndiGo Owner Rahul Bhatia: ఇండిగో సంక్షోభం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సుమారు 2000 విమానాలను రద్దు చేసింది. ఐదు రోజులుగా ప్రయాణీకులు ఎయిర్ పోర్టులలో తీవ్ర అవస్థలు పడ్డారు. కరోనా, ఇండో-పాక్ ఉద్రిక్తతల సమయంలో కాకుండా, ఈ స్థాయిలో విమానాలు రద్దవ్వండ ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇండిగో యజమాని ఎవరు? ఆయన ఆస్తుల విలువ ఎంత? లాంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దేశీయ దిగ్గజ విమానాయన సంస్థ అయిన ఇండిగో వ్యవస్థాపకుడు రాహుల్ భాటియా. ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ కు అధినేత. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో జన్మించిన ఆయన.. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భాటియా వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. అతడి తండ్రి కపిల్ భాటియా గతంలో ఢిల్లీ ఎక్స్ ప్రెస్ అనే ట్రావెల్ ఏజెన్సీని నడిపారు. ఇండిగో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన విమానయాన సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్నా, భాటియా లోప్రొఫైల్ ను మెయింటెయిన్ చేస్తారు. పబ్లిక్ ఫోరమ్లలో అత్యంత అరుదుగా కనిపిస్తారు. కంపెనీ నాయకత్వ నిర్మాణంలో కీలక మార్పుల తర్వాత ఆయన 5 సంవత్సరాల కాలానికి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆయన 137 గమ్యస్థానాలకు 2,700 రోజువారీ విమానాలను నడిపిస్తున్నారు. ఆయన ఆపరేషనల్ విధానం సామర్థ్యం విమానయాన రంగంలో ఇండిగోను కీలక స్థాయికి తీసుకెళ్లింది.
రాహుల్ భాటియా నికర విలువ 2025లో 10 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ విలువ 2023లో 3.5 బిలియన్లుగా ఉండేది. కేవలం రెండు సంవత్సరాల్లో ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. మార్కెట్ సవాళ్లు ఉన్నప్పటికీ ఎయిర్ లైన్ పేద, మధ్య తరగతి ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని టికెట్ల ధరలను చీప్ గా ప్రకటించింది. నెమ్మదిగా దేశీయ విమానయాన రంగ దిగ్గజంగా మారడంతో సంస్థ ఆస్తులతో పాటు ఆయన ఆస్తులు కూడా పెరిగాయి. విమానయాన సంస్థ మాత్రమే కాకుండా, భాటియా గురుగ్రామ్ లో మూడు హోటళ్లను కలిగి ఉన్నారు. ఆయన విస్తృతమైన బిజినెస్ పోర్ట్ ఫోలియో రోజు రోజుకు సంపదను పెరిగేలా చేసింది. దేశ విమానయాన రంగాన్ని మార్చడంలో ఆయన పాత్రను గుర్తించి ది ఎకనామిక్ టైమ్స్ ఎర్నెస్ట్ & యంగ్ అవార్డుతో సత్కరించింది.
సరసమైన, సమర్థవంతమైన క్యారియర్ గా ఇండిగోను తీర్చి దిద్దడంలో భాటియా కీలక పాత్ర పోషించారు. తక్కువ ధరకే విమాన సర్వీసులు నడిపించాలనే ఆలోచనతో రాహుల్ భాటియా 2006లో ఇండిగోను ప్రారంభించారు. ఇందుకోసం ఆయన విమానయాన రంగంలో అనుభవజ్ఞుడైన రాకేష్ గంగ్వాల్ తో కలిసి ఈ సంస్థను స్థాపించారు. ఒకే ఆపరేషన్ నుంచి ప్రారంభించి, ఇండిగో దేశీయ మార్కెట్ లో క్రమపద్ధతిలో విస్తరించారు. ఇవాళ దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. రోజుకు 2,700 పైగా విమానాలను నడుపుతోంది. భారత ఉపఖండంతో పాటు మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా అంతటా 137 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. దేశంలోని అత్యంత విస్తృతమైన, సమయపాలన కలిగిన క్యారియర్ గా ఇండిగో గుర్తింపు తెచ్చుకుంది. కానీ, తాజా సంక్షోభంతో ఆ సంస్థ మీద అనేక అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను వెనక్కి తీసుకునేలా కావాలనే విమానాలను రద్దు చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్రం ఉన్నత స్థాయి దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ వివాదం నుంచి ఇండిగో ఎలా బయటపడుతుందో చూడాలి.
Read Also: ఇండిగో సంక్షోభం, విమాన టికెట్ల ధరల పెంపుపై కేంద్రం సీరియస్!