ఇండిగో సంక్షోభం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వందల విమానాలు రద్దు అయ్యాయి. ఈ సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరల కంటే, హైదరాబాద్ నుంచి భోపాల్ లాంటి నగరాలకు వెళ్లే టికెట్ ధరలు అధికంగా ఉండడం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది తప్పని పరిస్థితులలో ఎక్కువ ధర ఉన్నా టికెట్లు కొనుగోలు చేశారు. అయితే, టికెట్ల ధరలు అసాధారణంగా పెంచడంపై కేంద్రం సీరియస్ అయ్యింది.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఇతర విమానయాన సంస్థలు అత్యధిక ధరలు పెంచడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ దృష్టిసారించింది. ప్రస్తుత పరిస్థితిని క్యాష్ చేసుకోవద్దంటూ ఇతర విమాన సంస్థలకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. విమాన సంస్థలు పెంచే ధరలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ వెల్లడించింది. “ఇండిగో అంతరాయం సమయంలో కొన్ని విమానయాన సంస్థలు అసాధారణంగా టికెట్ల ధరలను పెంచినట్లు మా దృష్టికి వచ్చింది. సంక్షోభాన్ని కొన్ని సంస్థలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు. అధిక ధరల నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, తగిన ఛార్జీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఛార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాలని విమానయాన సంస్థలకు అధికారిక ఆదేశం జారీ చేస్తున్నాం. పరిస్థితి పూర్తిగా మెరుగుపడే వరకు ఈ పరిమితులు అమలులో ఉంటాయి” అని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది.
Read Also: ఇండిగోపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్, ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశం!
ఇండిగో విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నుంచి భోపాల్కు ఎయిర్ ఇండియా టికెట్ ధర ఏకంగా రూ.1.3 లక్షలు పలికింది. ఈ ఛార్జీతో కేవలం ఒకే సీటు అందుబాటులో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్- విశాఖపట్నం మార్గంలో ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధరలు రూ.69,787 పలికాయి. హైదరాబాద్-విజయవాడ టికెట్ ధర రూ.28 వేలు ఉంది. ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు నాన్ స్టాప్ విమాన టికెట్ ధర రూ.12,894 పలికింది. అత్యంత ఖరీదైన నాన్ స్టాప్ టికెట్ ధర రూ. 29,524 ఉండగా, ముంబై సెక్టార్లో 12 గంటల టూ స్టాప్ సర్వీస్కు తక్కువ టికెట్ ధర రూ. 32,095 పలికింది. ఐదు గంటల వన్ స్టాప్ విమాన టికెట్ ధర రూ. 59,482గా ఉంది. అదే మార్గంలో మరో వన్ స్టాప్ విమాన టికెట్ ధర రూ.70,329కి చేరుకుంది. ఒకానొక సమయంలో హైదరాబాద్-ఢిల్లీ విమాన టికెట్ ధర రూ.89 వేలకు చేరింది. ఢిల్లీ-ముంబై విమాన టికెట్ ధర రూ.40 వేలు పలికింది. తాజాగా ధరల పెంపు వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది.
Read Also: ఇండిగో క్రైసిస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు!