Indian Railways Refund: తమిళనాడులో భారీ వర్షాలు, వరదల కారణంగా రద్దయిన రైలు టికెట్ కు రీఫండ్ ఇవ్వకుండా నిరాకరించిన దక్షిణ మధ్య రైల్వేకు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఊహించని షాకిచ్చింది. బాధితుడికి రీఫండ్తో పాటు మానసిక వేదన, న్యాయపరమైన ఖర్చుల కింద మొత్తం రూ.30 వేలకుపైగా చెల్లించాలని రైల్వే అధికారులను ఆదేశించింది.
ఈ కేసు తెలంగాణకు చెందిన ఓ వృద్ధుడికి సంబంధించినది. ఆయన 2023 డిసెంబర్లో తీర్థయాత్ర కోసం తమిళనాడులోని మెల్మరువత్తూరు, తిరునెల్వేలి, చెన్నై ప్రాంతాలకు వెళ్లేందుకు ఏసీ 3 టైర్ రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇందుకోసం ఆయన సుమారు రూ.5,955 ఖర్చు చేశారు. అయితే ప్రయాణ సమయంలో తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు రావడంతో రైల్వే సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయన ప్రయాణించాల్సిన రైలు పూర్తిగా గమ్యస్థానానికి వెళ్లకుండా మదురై దగ్గరే నిలిపివేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసింది. దీంతో ఆయన ముందుకు ప్రయాణించలేకపోయారు. అలాగే తిరుగు ప్రయాణ టికెట్ను కూడా ఉపయోగించే అవకాశం లేకుండా పోయింది.
ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో హైదరాబాద్కు చేరుకున్న ఆయన, ఇంటికి వచ్చిన వెంటనే రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ రీఫండ్ కోసం దరఖాస్తు చేశారు. పలుమార్లు రైల్వే అధికారులను సంప్రదించి అసలు టిక్కెట్లు, అవసరమైన పత్రాలు కూడా సమర్పించారు. అయితే, నిర్ణీత గడువులోగా రీఫండ్ కోసం దరఖాస్తు చేయలేదనే కారణంతో ఆయన అభ్యర్థనను రైల్వే అధికారులు తిరస్కరించారు. వరదల వంటి అత్యవసర పరిస్థితుల్లో సమయానికి రీఫండ్ దరఖాస్తు చేయడం సాధ్యం కాదని వృద్ధుడు పేర్కొంటూ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. మరోవైపు రైల్వే అధికారులు తమ వాదనలో రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం ప్రయాణికులు నిర్ణీత గడువులోగా రీఫండ్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఏ రిజర్వేషన్ కౌంటర్లోనైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కూడా వాదించారు.
అయితే ఈ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ రైల్వే శాఖ వాదనను అంగీకరించలేదు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైళ్లు రద్దయినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై రైల్వే నిబంధనల్లో స్పష్టత లేదని కమిషన్ పేర్కొంది. అలాంటి అసాధారణ పరిస్థితుల్లో సాధారణ రీఫండ్ నిబంధనలను యథాతథంగా అమలు చేయడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. వరదల్లో చిక్కుకున్న వృద్ధుడి మొదటి ప్రాధాన్యత సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే అవుతుందని, వెంటనే రీఫండ్ కోసం దరఖాస్తు చేయాలని ఆశించడం మానవతా దృక్పథానికి విరుద్ధమని కమిషన్ వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారుడు ఇంటికి చేరుకున్న వెంటనే రీఫండ్ కోసం ప్రయత్నించినప్పటికీ, ఆయన అభ్యర్థనను రైల్వే శాఖ సరైన రీతిలో పరిశీలించలేదని తెలిపింది.
ఈ వ్యవహారాన్ని సేవల్లో లోపంగా పరిగణించిన కమిషన్, టికెట్ మొత్తమైన రూ.5,955ను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా మానసిక వేదనకు రూ.15,000, కేసు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని రైల్వే అధికారులను ఆదేశించింది. మొత్తం 45 రోజుల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.
Read Also: కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ మళ్లీ ప్రారంభం.. టికెట్ ధర జస్ట్ 50 రూపాయలే!