IRCTC Sapta Jyotirlinga Yatra 2026: శివ భక్తులకు భారతీయ రైల్వే అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను ఒకేసారి దర్శించుకునేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఈ యాత్రను ప్రకటించింది. ‘సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర’ పేరుతో చేపట్టిన ఈ పర్యటన సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ టూర్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో కొనసాగనుంది. ప్రయాణం సెప్టెంబర్ 25న ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. యాత్ర పూర్తయ్యాక అక్టోబర్ 5న తిరిగి అదే స్టేషన్కు రైలు చేరుకుంటుంది.
మొదటగా యాత్రికులు ఉజ్జయినికి చేరుకుంటారు. అక్కడ మహాకాలేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడంతో పాటు మహాకాల్ లోక్ కారిడార్ ను సందర్శిస్తారు. రామ్ ఘాట్లో జరిగే సాయంత్రం హారతిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న భక్తులు తెల్లవారుజామున జరిగే భస్మా హారతిని కూడా దర్శించవచ్చు. అనంతరం ఓంకారేశ్వర్కు వెళ్లి అక్కడి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ద్వారకకు ప్రయాణం కొనసాగుతుంది.
ద్వారకలో ద్వారకాధీష్ ఆలయం, రుక్మిణి దేవి ఆలయం, నాగేశ్వర జ్యోతిర్లింగం, బేట్ ద్వారకలను సందర్శిస్తారు. ఆ తర్వాత సోమనాథ్కు వెళ్లి సోమనాథ్ ఆలయంతో పాటు సోమనాథ్ బీచ్, భల్కా తీర్థాన్ని సందర్శించేలా యాత్రను రూపొందించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణేకు చేరుకుని భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తారు. అక్కడి నుంచి ఛత్రపతి సంభాజీనగర్కు వెళ్లి ఎల్లోరా గుహలను సందర్శిస్తారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాస ఆలయాన్ని కూడా చూసే అవకాశం ఉంటుంది. అనంతరం గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగంలో పూజలు చేస్తారు. యాత్ర చివరి దశలో నాసిక్కు చేరుకుంటారు. అక్కడ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, పంచవటి ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో మొత్తం ఏడు జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం పూర్తవుతుంది.
IRCTC ఈ యాత్రను మూడు కేటగిరీల్లో అందిస్తోంది. సుపీరియర్ ఏసీ ఫస్ట్ క్లాస్లో సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.1,34,255గా ఉంది. ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.1,19,425, ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి రూ.1,17,305 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.1,09,910గా నిర్ణయించారు. డీలక్స్ ఏసీ టూ టైర్లో ఒక్కరికి రూ.1,24,755, ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.1,09,925, ముగ్గురికి రూ.1,07,805గా ధర ఉంది. పిల్లలకు రూ.1,00,410 చార్జీ ఉంటుంది. కంఫర్ట్ ఏసీ త్రీ టైర్ ప్యాకేజీలో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.1,05,760, ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.90,930, ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.88,810 చెల్లించాలి. పిల్లలకు రూ.81,415గా ఉంది.
రైలు ప్రయాణంతో పాటు ఉజ్జయిని, ద్వారక, పూణేలో మొత్తం మూడు రాత్రుల హోటల్ వసతి కల్పిస్తారు. నాసిక్లో బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక సదుపాయం ఉంటుంది. మిగిలిన ఏడు రాత్రులు రైలులోనే గడపాల్సి ఉంటుంది. టూరిస్టులకు టీ, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తారు. ఎంట్రీ ఫీజులు, లోకల్ గైడ్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారు. ఏడు జ్యోతిర్లింగాలను ఒకే పర్యటనలో దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈ యాత్ర ఉపయోగకరంగా ఉండనుంది.
Read Also: కేరళ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు!