IRCTC Ticket Booking Scam: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కవ మంది రైలు ప్రయాణాలకు మొగ్గు చూపుతారు. కానీ, IRCTCలో టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. బుకింగ్ విండో ఓపెన్ అయిన క్షణాల్లోనే టిక్కెట్లు మాయం అవుతాయి. చాలా మంది ప్రయాణికులకు తమ వివరాలు నమోదు చేసేలోపే టిక్కెట్లు అయిపోయి అనే మెసేజ్ కనిపిస్తుంది.
రైల్వేలో టిక్కెట్ల మాయం వెనుక ఓ డిజిటల్ రాకెట్ నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కోడర్లు, దళారులు, ఏజెంట్లతో కూడిన ఒక సమాంతర నెట్ వర్క్. వీళ్లు హై స్పీడ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి సాధారణ వినియోగదారులకు అందకుండా క్షణాల్లో టిక్కెట్లను దక్కించుకుంటారు.
పలు జాతీయ పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రహ్మోస్, టెస్లా, అవెంజర్స్, డాక్టర్ డూమ్ లాంటి పేర్లతో పిలవబడే ఈ టూల్స్, ప్రయాణికుల వివరాలను ఆటోఫిల్ చేయడానికి, OTP లను ప్రాసెస్ చేయడానికి, క్యాప్చాలను కూడా ఏకకాలంలో ఫిల్ చేయడానికి సహకరిస్తాయి. ఒక సాధారణ వినియోగదారు బుక్ చేసుకోవడానికి సుమారు 30 సెకన్లు తీసుకుంటే, ఈ చట్టవిరుద్ధమైన యాప్లు 15 సెకన్లలోపే ఈ ప్రాసెస్ ను పూర్తి చేస్తాయి.
ఈ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లకు యాక్సెస్ ను ‘సూపర్ సెల్లర్స్’ ద్వారా నెలకు రూ. 1,500 నుంచి రూ. 2,500 వరకు అమ్ముతున్నారు. దీని తాజా వెర్షన్ అయిన బ్రహ్మోస్, ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న కారణంగా ఒక్కో టిక్కెట్టుకు రూ. 99 కూడా వసూలు చేస్తున్నారు. ఈ టూల్స్ లో కొన్నింటిని, సిస్టమ్లోని లోపాలు తెలిసిన IRCTC మాజీ ఉద్యోగులు క్రియేట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు పలుమార్లు దాడులు చేసినప్పటికీ, ఈ కుంభకోణం కొత్తరూపం దాల్చుతూనే ఉంది. రైల్వేలు ఒక లొసుగును సరిచేసిన ప్రతిసారీ, కోడర్లు మరింత వేగవంతమైన, తెలివైన సాఫ్ట్ వేర్ వెర్షన్లను అభివృద్ధి చేస్తూ, ఈ దందాను ఒక అడుగు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కారణంగా ఒక అనధికార మార్కెట్ వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా పండుగలు, తత్కాల్ రద్దీ సమయాల్లో చాలా మంది ప్రయాణికులు టిక్కెట్లు పొందడానికి ఏజెంట్లపై ఆధారపడుతున్నారు.
Read Also: ప్రభుత్వానికే వార్నింగ్ ఇస్తున్న ఎయిర్ లైన్స్ సంస్థలు.. ముదిరిన సీట్ సెలక్షన్ లొల్లి!
రైల్వే ఆధార్ ధృవీకరణ తప్పనిసరి లాంటి చర్యలు తీసుకున్నప్పటికీ, డిజిటల్ టికెటింగ్ కుంభకోణం స్థాయి, అధునాతనతతో పోలిస్తే చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కుంభకోణాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన వ్యవస్థ కంటే ఇది మరింత వేగంగా విస్తరిస్తోందంటున్నారు.