Indian Railway Food: భారతీయ రైల్వేలో సాధారణంగా దక్షిణాది ఫుడ్స్ తో పోల్చితే, నార్త్ ఫుడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుతారు. కొన్నిసార్లు ప్రయాణీకులకు నచ్చకపోయినా కొనుగోలు చేయాల్సి వస్తుంది. మరికొంత మంది ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే, ఇకపై అలాంటి సమస్య లేకుండా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లలో లోకల్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. తాజాగా వందేభారత్ రైళ్లలో అందించి ఫుడ్స్ విషయంపై అధికారులతో చర్చించారు. ప్రయాణీకులకు తమ ప్రాంత సంస్కృతి, అభిరుచులను ప్రతిబింబించేలా స్థానిక వంటకాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో అందించాల్సిన ఫుడ్స్ గురించి ఓ జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాథమికంగా రెడీ అయిన ఈ లిస్ట్, త్వరలో అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
⦿ కేరళ రూట్లలో: కేరళ ప్రాంతంలో నడిచే వందేభారత్ రైళ్లలో మలబార్ చికెన్ బిర్యానీ, వరుత్తరచ చికెన్ కర్రీ, అల్లెప్పీ వెజ్ కర్రీ లాంటి ఫుడ్స్ అందుబాటులో ఉంచనున్నారు.
⦿ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో: హైదరాబాదీ బిర్యానీ, పెరుగన్నం, పప్పు అన్నం, ఇడ్లీ, దోశ లాంటి ఫుడ్స్ అందుబాటులో ఉండనున్నాయి.
⦿ కట్రా-శ్రీనగర్ రూట్ లో: కశ్మీరీ కహ్వా, రాజ్మా, కశ్మీరీ పులావ్, అంబల్ కడ్డూ, బబ్రూ లాంటి స్థానిక వంటకాలు లభించనున్నాయి.
ఈ కొత్త నిర్ణయం ద్వారా సౌత్ ఇండియన్ రూట్లలో ఇడ్లీ-దోశ, పశ్చిమ భారతంలో ధోక్లా-థెప్లా లాంటి ఫుడ్స్ అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్న ఈ వంటకాల ప్రిపరేషన్.. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
⦿ ప్రారంభం: ముందుగా వందే భారత్ రైళ్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు.
⦿ విస్తరణ: భవిష్యత్తులో దశలవారీగా అన్ని రైళ్లకు విస్తరిస్తారు.
⦿ ఉద్దేశ్యం: ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం, రైలు వెళ్లే ప్రాంతాల సంస్కృతి, రుచులను ప్రతిబింబించే ఆహారం అందించడం. మొత్తంగా ఈ నిర్ణయంతో రైల్వే ప్రయాణీకులు తమకు నచ్చిన ఫుడ్స్ ను హ్యాపీగా తినే అవకాశం ఉంటుంది.
అటు టికెట్ల బుకింగ్ కు సంబంధించి నకిలీ ఐడీలపై రైల్వే కీలక చర్యలు తీసుకున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కఠినమైన కంట్రోలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత కొత్త యూజర్ ఐడీలను సృష్టించే నకిలీ గుర్తింపులను బ్లాక్ చేసినట్లు చెప్పారు. గతంలో ఆ సంఖ్య లక్ష ఉండగా, ఇప్పుడు 5 వేలకు తగ్గాయన్నారు. త్వరలోనే అన్నింటినీ బ్లాక్ చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో 3 కోట్లకు పైగా నకిలీ అకౌంట్స్ ను బ్లాక్ చేసినట్లు తెలిపారు. సిస్టమ్ ద్వారా 2 కోట్లకు పైగా యూజర్ ఐడీలు తాత్కాలికంగా క్యాన్సిల్ చేసినట్లు చెప్పారు. టికెట్ బుకింగ్ వ్యవస్థ ప్రయాణికులకు సులభంగా, సజావుగా ఉండేలా చూసుకోవాలని మంత్రి వైష్ణవ్ అధికారులను ఆదేశించారు.
Read Also: లోయర్ బెర్త్ విషయంలో కీలక నిర్ణయం, అసలు విషయం చెప్పేసిన అశ్విని వైష్ణవ్!