Loco Pilot Stops Train After People Wave Hands: రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పరుగులు పెట్టడం తరచూ చూస్తుంటాం. కానీ, రైల్వే గేట్ దగ్గర నిలబడి చెయ్యెత్తగానే రైలు ఆగిపోవడం ఎప్పుడైనా చూశారా? అచ్చం ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బీహార్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమ్ చంపారన్ జిల్లాలోని కుమార్బాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు 8, 2026న సాయంత్రం 4 గంటల సమయంలో ముజఫర్పూర్-నార్కటియాగంజ్ డెము రైలు అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. రైల్వే గేట్ దగ్గర ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు నిలబడి ఉన్నారు. రైలు వస్తున్న సమయంలో వారిలో కొందరు చేతులు ఊపుతూ లోకో పైలెట్కు సిగ్నల్ ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో రైలు నెమ్మదించి అక్కడే ఆగిపోయింది. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు సామానుతో కలిసి లోపలికి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రాలేదు.
అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్లు చేస్తూ.. “ఇది రైలా? ఆర్టీసీ బస్సా?” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా చేతులు ఊపగానే రైలు ఆపడంతో, “ఎర్ర బస్సు డ్రైవర్లా ఉన్నాడే.. చెయ్యెత్తగానే రైలు ఆపేశాడు” అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ఘటనపై సీరియస్గా స్పందిస్తున్నారు. రైల్వే నిబంధనలకు అనుగుణంగా కాకుండా రైలును మధ్యలో ఆపి ఉంటే, సంబంధిత లోకో పైలెట్పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రైలును ఎక్కడ, ఎప్పుడు ఆపాలి అనే విషయంలో రైల్వేలో స్పష్టమైన భద్రతా నిబంధనలు ఉంటాయని, వాటిని ఉల్లంఘించడం ప్రయాణికుల భద్రతకు సమస్యగా మారవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ఆధారంగానే లోకో పైలెట్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పలేం. రైలు ఎందుకు ఆపారు? అక్కడ ఏదైనా అత్యవసర పరిస్థితి ఉందా? ఆ వ్యక్తులకు ముందుగా అనుమతి ఉందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై రైల్వే శాఖ నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. వీడియోలో కనిపించిన సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారా? లోకో పైలెట్కు ఏదైనా పరిచయం ఉన్న వ్యక్తుల కోసమే రైలు ఆపారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలు కూడా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కొందరు దీన్ని సరదా ఘటనగా చూస్తుండగా, మరికొందరు రైల్వే భద్రతా నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రైల్వే అధికారులు స్పందించిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన అసలు కారణం ఏమిటనేది తెలిసే అవకాశం ఉంది.
Read Also: చివరి నిమిషంలో టికెట్ కావాలా? సింపుల్ గా ఇలా ట్రై చేస్తే కన్ఫార్మ్ సీటు పక్కా!