Eluru: అసలే కలికాలం.. ఈ కాలంలో ఆడపిల్ల పుడితే చాలామంది తల్లిదండ్రులు హడలిపోతారు. అమ్మాయి కాలేజీకి వెళ్లిన తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయోనని భయంతో బెంబేలెత్తిపోతారు. తాజాగా ప్రేమ పెళ్లి పేరుతో యువతిని బేరం పెట్టారు నలుగురు కుర్రాళ్లు. సంచలనం రేపిన ఈ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి కాలేజీలో చదువుతోంది. ఆ యువతిని కొందరు యువకులు బయటకు తీసుకెళ్లారు. బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన ఓ యువకుడితో వీరపల్లి పోలీస్స్టేషన్లో ప్రేమపెళ్లి చేశారు. ఇంతవరకు బాగానే సాగింది. పెళ్లి తర్వాత కూతురు యోగక్షేమాలు తెలియక తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు.
అదే సమయంలో పెళ్లి తర్వాత యువకుడి తరఫు వ్యక్తులు.. అమ్మాయి తల్లిదండ్రులతో రాయబారం మొదలుపెట్టారు. రూ. 12 లక్షలు ఇస్తే మీ అమ్మాయిని పంపిస్తామని చెప్పడం మొదలుపెట్టారు. పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె కోసం కన్న తండ్రి రూ. 6 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. దీనికి సంబంధించి ఆడియో రికార్డింగ్లు, రాయబారాల సంభాషణలు సోషల్మీడియాలో హంగామా చేస్తున్నాయి.
తమ కూతుర్ని బెదిరించి, కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లి బేరసారాలకు దిగారని ఆరోపించాడు తండ్రి. తమను చూసినా కూతుర్ని రాలేని పరిస్థితిలో ఉంచారని యువతి కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రేమపెళ్లి వ్యవహారం ఏలూరు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.