ఈశాన్య రాష్ట్రం అయిన మిజోరాం భారతీయ రైల్వే గ్రిడ్ తో అనుసంధానం అయ్యింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్ నేషనల్ రైల్వే గ్రిడ్ లోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు బైరాబి నుంచి ఐజ్వాల్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చేది. సుమారు ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టేది. ఈ రైల్వే లైన్ తో ఐజ్వాల్ చేరుకునేందుకు కేవలం 2 గంటలు సరిపోతుంది. అంతే కాదు, గౌహతి, అగర్తాలా, ఇటానగర్ తర్వాత జాతీయ రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానించబడిన నాల్గవ ఈశాన్య రాష్ట్ర రాజధానిగా ఐజ్వాల్ గుర్తింపు తెచ్చుకుంది. కొత్త మార్గంతో పాటు, ఐజ్వాల్-ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్, ఐజ్వాల్-గౌహతి ఎక్స్ ప్రెస్, ఐజ్వాల్-కోల్ కతా ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఐజ్వాల్ నుంచి గౌహతికి రెగ్యులర్ ప్యాసింజర్ సర్వీస్ ఇవాళ ప్రారంభం కాగా, ఐజ్వాల్- కోల్ కతా, ఐజ్వాల్- ఢిల్లీ ప్యాసింజర్ సర్వీసులు సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 19 తేదీలలో ప్రారంభం అవుతాయి.
సుమారు 51.38 కిలో మీటర్ల మేర నిర్మించిన బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ను ఇండియన్ రైల్వే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని నిర్మించింది. దట్టమైన అడవుల గుండా వెళ్లిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సామగ్రి, గిర్డర్లు, గాంట్రీ క్రేన్లు సహా హెవీ డ్యూటీ ఎక్యుప్ మెంట్స్ ను తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన ప్రతి వస్తువును మిజోరం బయటి నుంచే తీసుకురావాల్సి వచ్చింది. ట్రాక్ మీద వేసి ఇసుక, చిప్స్, రాళ్ళు లాంటి ముడిపదార్థాలను అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు. వంతెనల్లో ఉపయోగించిన భారీ గిర్డర్లను మహారాష్ట్రలోని అహ్మద్ నగర్, వార్ధాలో తయారు చేసి తెచ్చారు. వీటిని తరలించేందుకు సరైన రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో ముందుగా అప్రోచ్ రోడ్లను నిర్మించాల్సి వచ్చింది. వాటి ద్వారా వస్తువులను రైల్వే అధికారులు తరలించారు. గిర్డర్లను నిర్మించడానికి ఉపయోగించే గ్యాంట్రీ క్రేన్లను కూడా విడదీసి, ఆ ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ మళ్లీ బిగించారు.
Welcome Aizawl to the Railway map of India!
🛤️ Bairabi-Sairang new rail line inaugurated by PM @narendramodi Ji. pic.twitter.com/F0IO0KEqiE
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 13, 2025
తాజాగా నిర్మించిన రైల్వే లైన్ దాదాపు 23 శాతం వంతెనల గుండా వెళుతుంది. 30 శాతం సొరంగాల గుండా వెళుతుంది. ఎన్నో కీలక మలుపులు ఉన్నాయి. మిగిలి ఉన్న 47 శాతం కూడా చాలా నిటారుగా ఉన్న వాలులపై ఉంది. ఇక్కడ భూమి స్థిరంగా ఉండదు. ఈ ప్రాంతం అంతా భూకంప జోన్ 5లో ఉంది. కొండ ప్రాంతాలలో, కొండచరియలు విరిగిపడటం ఒక పెద్ద సమస్య. ట్రాక్లు ప్రభావితం కాకుండా నిరోధించడానికి, ఈ విభాగం వెంట వాల్ ఏర్పాటు చేశారు. మొత్తం 51.38 కి.మీ బైరాబి-సైరాంగ్ విభాగంలో 45 సొరంగాలు, 55 పెద్ద, 88 చిన్న వంతెనలు ఉన్నాయి. ఈ లైన్ లో సైరాంగ్ సమీపంలో కురుంగ్ నదిపై ఉన్న ఎత్తైన పైర్ వంతెనన ఉంది. ఇది భూమి నుంచి 114 మీటర్ల ఎత్తులో ఉంది.
అటు ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం స్థానిక కార్మికులు అందుబాటులో లేకపోవడంతో బయటి నుంచి మనుషులను తీసుకురావాల్సి వచ్చింది. రిమోట్ ప్రాజెక్ట్ సైట్ ను చూసి, ఫోన్ నెట్ వర్క్ కూడా లేకపోవడంతో చాలా మంది సైలెంట్ గా వెళ్లిపోయారు. కొన్నిసార్లు తినడానికి సరిగా నిత్యావసర సరుకులు కూడా ఉండేవి కాదు. ఉన్నవాటితో సరిపెట్టుకుని పనుల్లో భాగస్వామ్యం అయ్యారు. లాజిస్టికల్ ఇబ్బందులు, ప్రాజెక్ట్ జాప్యాల కారణంగా ఖర్చు భారీగా పెరిగింది. 2008లో ప్రాజెక్ట్ మంజూరు చేయబడిన సమయంలో, దాని అంచనా వ్యయం రూ. 619 కోట్లు. కానీ, పూర్తయ్యే సమయానికి ఖర్చు రూ. 8,071 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం బైరాబి-సైరాంగ్ లైన్ అంతటా విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. విద్యుదీకరణ పూర్తయిన తర్వాత, ఈ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును నడపాలని ఇండియన్ రైల్వే భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: హైదరాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్లో కీలక ముందడుగు.. ఆ పనులు మొదలయ్యాయ్!