Train Passengers Alert: భారీ వర్షాలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమ బెంగాల్ న్యూ ఫరక్కా రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ల కింద భూమి కుంగిపోవడంతో దక్షిణ బెంగాల్, ఉత్తర బెంగాల్ మధ్య రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు రైళ్లను నడపడం కష్టమని తూర్పు రైల్వే అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా న్యూ ఫరక్కా స్టేషన్కు సమీపంలో సుమారు 20 మీటర్ల మేర రైల్వే ట్రాక్ కింద భూమి కోతకు గురైంది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో న్యూ ఫరక్కా నుంచి బర్హర్వా వైపు దాదాపు 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ట్రాక్ ను రిపేర్ చేసేందుకు రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. సుమారు 150 మంది కార్మికులతో పాటు సీనియర్ రైల్వే ఇంజనీర్లు పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు. జార్ఖండ్ నుంచి సరుకు రైళ్ల ద్వారా తీసుకొచ్చిన స్టోన్ చిప్స్, కంకరను ఉపయోగించి కుంగిపోయిన ప్రాంతాన్ని పూడ్చే పనులు చేస్తున్నారు. అయితే పనులు జరుగుతున్న సమయంలో మళ్లీ నేల కుంగడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
గురువారం రాత్రి సమీపంలోని చెరువు గట్టు వైపు మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభం కూడా వంగిపోయింది. దీంతో మరమ్మతు పునరుద్ధరణ పనులకు మరింత ఆటంకం ఏర్పడింది. డౌన్ లైన్లో గురువారం మధ్యాహ్నం నుంచి పరిమిత స్థాయిలో రైళ్లను నడిపించారు. అయితే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం కూడా అనేక రైళ్లను రద్దు చేశారు.
ఈ ఘటన కారణంగా తూర్పు రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. హౌరా–గౌహతి సరైఘాట్ ఎక్స్ ప్రెస్, సీల్దా–బమన్ హట్ ఉత్తరబంగా ఎక్స్ ప్రెస్, సీల్దా–అలీపుర్దూర్ కాంచన్కన్య ఎక్స్ ప్రెస్, సీల్దా–న్యూ అలీపుర్దూర్ డార్జిలింగ్ మెయిల్, కోల్ కతా–జోగ్బని ఎక్స్ ప్రెస్, హౌరా–కతిహార్ ఎక్స్ ప్రెస్ లాంటి రైళ్లు క్యాన్సిల్ అయిన వాటిలో ఉన్నాయి. అదే సమయంలో 27575 హౌరా–కామాఖ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్, 15961 హౌరా–దిబ్రూగర్ కమ్రూప్ ఎక్స్ ప్రెస్ లాంటి కొన్ని రైళ్ల సేవలను పునరుద్ధరించారు.
రైలు సేవలు నిలిచిపోవడంతో ఉత్తర బెంగాల్కు వెళ్లే రోజువారీ ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ బస్సులకు డిమాండ్ పెరగడంతో టికెట్లు త్వరగా పూర్తవుతున్నాయి. దీంతో కొందరు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.
రైల్వే అధికారులు మాత్రం ట్రాక్ పూర్తిగా సేఫ్ అని నిర్ధారించిన తర్వాతే సాధారణ రైలు సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. పరిస్థితిని బట్టి మరో ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వీలైనంత త్వరగా రైలు సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు.
Read Also: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, తిరుపతి సహా 8 రైళ్ల టైమింగ్స్ ఛేంజ్!