నందా దేవి పర్వతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాఖండ్లోని చమొలీ జిల్లాలో అందమైన ప్రకృతి దృశ్యాలకు నందాదేవి పర్వతం కేరాఫ్ అడ్రస్. భారతదేశంలో రెండవ ఎత్తయిన పర్వతం నందాదేవి. ఇది దాదాపు 7,816 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 1983లో చివరిసారిగా ట్రెక్కర్లు ఈ నందాదేవి పర్వతాన్ని అధిరోహించారు. ఆ తర్వాత ఆ పర్వతం పైకి వెళ్లడం నిషేధించారు. మళ్లీ ఇప్పుడు తిరిగి నందాదేవి పైకి ట్రెక్కర్లను అనుమతించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలోనే ఆ పని చేయబోతోంది. పర్వతారోహణను ఇష్టపడేవారు నందాదేవి పర్వతానికి వెళ్లేందుకు సిద్ధపడండి.
నందాదేవి పర్వతం ప్రాముఖ్యత
నందా దేవి పర్వతం ఎంతో ప్రత్యేకమైనది. మనదేశంలో కాంచన జంగా పర్వతం తర్వాత భారతదేశంలో రెండవ ఎత్తైన శిఖరం నందాదేవి. హిమాలయాలలో ఉన్న ఈ పర్వతం యునెస్కో జాబితాలో కూడా చోటు సంపాదించింది. ఉత్తరాఖండ్లోని దేవత అయిన నందాదేవి పేరు మీద ఈ పర్వతం ఏర్పడింది. స్త్రీ బలానికి, రక్షణకు ప్రత్యేకంగా ఆ పర్వతానికి దేవత పేరు పెట్టారని చెప్పుకుంటారు. ఈ పర్వతం చుట్టుపక్కల అరుదైన వన్యప్రాణులు, మొక్కలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా మంచు చిరుతలు, కస్తూరి జింకలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక సాంప్రదాయ వైద్యంలో వాడే పువ్వులు, మూలికలు నందాదేవిలో ఎన్నో ఉంటాయి.
ఎందుకు మూసివేశారు?
నందాదేవిని 1983లోనే మూసివేశారు. అంతవరకు ట్రెక్కర్లు ఈ పర్వతాన్ని ఎక్కేవారు. జన సమూహం అధికంగా పర్వతం పైకి వెళ్లడం, వ్యర్థ పదార్థాలను ఎక్కువగా పడేయడం వంటివి చేశారు. దాంతో అక్కడ వ్యర్ధాల నిర్వహణ కష్టంగా మారింది.
పర్వతంపై అణు ప్రమాదం?
అలాగే కొన్ని నివేదికలు చెబుతున్న ప్రకారం చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ లో జరుగుతున్న అణు కార్యక్రమాలపై నిఘా పెట్టడానికి అమెరికా, భారత్ కలిసి ఆపరేషన్ నందాదేవి ఫ్లూటోనియం మిషన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్లోని గర్హ్యాల్ హిమాలయాలలోని నందాదేవి శిఖరంపై అణు శక్తితో పనిచేసే ఒక రిమోట్ సెన్సింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. అయితే బలమైన మంచు తుఫాను రావడంతో ఫ్లూటోనియంతో నడిచే రేడియో ఐసోటోప్ ధర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ఆ పర్వతాలలో ఎక్కడో కూరుకుపోయింది. దీంతో ఆ మిషన్ విఫలం అయిపోయింది.
దీంతో ఇప్పటికీ నందాదేవి పరమత్వం పై ప్లూటోనియంతో నిండిన పరికరం ఎక్కడో ఒకచోట ఉంది. దాని వల్ల ఎప్పుడైనా ప్రమాదం ఏర్పడుతుందేమోనని భయపడుతున్నారు. అందుకే పర్యాటకులను అనుమతించలేదు. ఆ పరికరం ఇప్పటికీ అక్కడే ఉందని, ఇది పర్యావరణానికి ఎప్పటికైనా ముప్పు కలిగిస్తుందని భయాందోళనలు ఉన్నాయి. అయితే దీన్ని పూర్తిగా నిర్ధారించిన వారు లేరు.
నందాదేవి పర్వతాన్ని మళ్ళీ తిరిగి తెరిస్తే కొన్ని అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాలి. పర్యావరణ హితమైన ట్రెక్కింగ్ ప్రోటోకాల్ తో యాత్రలు సాగుతాయి. అలాగే పర్యాటకులకు స్లాట్లను కూడా కేటాయిస్తారు. అలా చెప్పిన సమయానికి ట్రెక్కింగ్ కు రావాల్సి ఉంటుంది. నందాదేవి పర్వతాన్ని ఎవరు పడితే వారు ఎక్కలేరు. మీకు ఎత్తయిన కొండలు ఎక్కిన అనుభవం, బలమైన శారీరక పరిస్థితులు ఉంటేనే మీరు ఈ పర్వతాన్ని ఎక్కగలరు. అలాగే నందాదేవి పర్వతానికి సోలోగా అనుమతించరు. ప్రభుత్వ గుర్తింపు పొందిన నిర్వాహకులతో వెళ్లే సమూహంలో భాగంగానే ప్రయాణించాలి.