India’s Most Unique Railway Station: భారతీయ రైల్వేలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో కొన్ని రైళ్లు, కొన్ని రైల్వే లైన్లు, మరికొన్ని రైల్వే స్టేషన్లు ఉన్నవాయి. వాటిలో ఒక యూనిక్ స్టేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దులో ఉన్న నవాపూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ గురించి తెలుసుకున్నవారెవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ సగం మహారాష్ట్రలో, మరో సగం గుజరాత్ లో ఉంటుంది. అంటే, ఒకే స్టేషన్లో నిలబడి రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఉన్న అనుభూతిని పొందొచ్చు.
నవాపూర్ రైల్వే స్టేషన్ పశ్చిమ రైల్వే పరిధిలో పనిచేస్తుంది. ఇది మహారాష్ట్రలోని నందుర్ బార్ జిల్లా, గుజరాత్ లోని తాపీ జిల్లా సరిహద్దులో ఉంది. స్టేషన్ మధ్యగానే రెండు రాష్ట్రాల సరిహద్దు వెళ్లడం దీని ప్రత్యేకత. అందుకే ఈ స్టేషన్ దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. స్టేషన్ లోకి అడుగుపెడితే నేలపై ఒక గీత కనిపిస్తుంది. అదే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను విడదీసే సరిహద్దు. ఒక అడుగు ముందుకు వేస్తే గుజరాత్, మరో అడుగు వెనక్కి వేస్తే మహారాష్ట్రలో ఉంటారు. ప్రయాణికులు ఈ గీత దగ్గర ఫొటోలు తీసుకుంటూ ప్రత్యేక అనుభూతిని ఆస్వాదిస్తుంటారు.
ఈ స్టేషన్ లోని బెంచీలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకే బెంచ్ లో కూర్చుంటే ఒక వ్యక్తి మహారాష్ట్రలో, పక్కనే కూర్చున్న మరో వ్యక్తి గుజరాత్లో ఉన్నట్టుగా ఉంటుంది. స్టేషన్లోని కొన్ని గదులు, కార్యాలయాలు కూడా రెండు రాష్ట్రాల సరిహద్దును తాకేలా నిర్మించారు. ఈ ప్రత్యేక పరిస్థితి కారణంగా పరిపాలనా పరంగా కూడా కొన్ని ఆసక్తికరమైన ఏర్పాట్లు ఉన్నాయి. రైల్వే నిర్వహణ మాత్రం ఒకే వ్యవస్థ కింద కొనసాగుతుంది. అయితే.. చట్టపరమైన, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాల్లో అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేస్తారు.
ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తారు. చాలా మందికి ఇది సాధారణ రైల్వే స్టేషన్లా కనిపించినా, దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న తర్వాత మాత్రం ఆశ్చర్యానికి గురవుతారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ స్టేషన్కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందుకే ట్రావెల్ లవర్స్ ఈ స్టేషన్ ను విజిట్ చేయాలని భావిస్తుంటారు.
దేశంలో రాష్ట్ర సరిహద్దులు దాటే ఎన్నో రహదారులు ఉన్నప్పటికీ, ఒకే రైల్వే స్టేషన్ను సరిహద్దు మధ్యలో నిర్మించడం చాలా అరుదైన విషయం. ఈ కారణంగానే నవాపూర్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత ఆసక్తి కలిగిన స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. ఒకవేళ మహారాష్ట్ర, గుజరాత్ వైపు ప్రయాణిస్తే, ఈ స్టేషన్ను తప్పకుండా చూడండి. ఒకే చోట నిలబడి రెండు రాష్ట్రాల్లో ఉన్న అనుభూతి ఎలా ఉంటుందో స్వయంగా ఆస్వాదించే ప్రయత్నం చేయండి.
Read Also: భూకంపం వచ్చినా భయంలేదు.. మన బుల్లెట్ రైలుకు సూపర్ సేఫ్టీ షీల్డ్!