New Traffic Fines Announced: కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టం చేస్తూ కొత్త జరిమానాలను ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త రూల్స్ పాటించకపోతే, మొదటి సారి తక్కువ జరిమానా ఉన్నప్పటికీ, రెండోసారి తడిసిమోపెడు కానుంది. కొన్ని సందర్భాల్లో లైసెన్స్ రద్దు లేదా జైలు శిక్ష కూడా ఉంటుంది.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే, మొదటిసారి రూ.100 జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే రూ.1000 ఫైన్తో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అటు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫోన్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారి రూ.500 ఫైన్ ఉండగా, రెండోసారి అదే తప్పు చేస్తే రూ.5000 వరకు జరిమానా విధిస్తారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేదా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపితే పరిస్థితి మరింత సీరియస్ గా ఉంటుంది. మొదటిసారి రూ.1000 జరిమానా పడుతుంది. అదే, రెండోసారి పట్టుబడితే రూ.10,000 వరకు జరిమానా విధించడంతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంది.
ఓవర్ స్పీడ్ ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఉండడంతో దీనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వేగం మించితే మొదటిసారి రూ.2000 జరిమానా వేస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే రూ.20,000 వరకు భారీ ఫైన్ విధిస్తారు. అలాగే అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం కూడా ఇకపై సీరియస్ అంశం కానుంది. మొదటిసారి రూ.1000 జరిమానా విధిస్తారు. రెండోసారి రూ.10,000 వరకు పెరుగుతుంది.
ఇక సిగ్నల్ జంప్ చేయడం కూడా కఠినంగా పరిగణించబడుతోంది. మొదటిసారి రూ.500 ఫైన్ పడుతుంది. అదే తప్పు మళ్లీ చేస్తే రూ.5000 జరిమానా విధిస్తారు. చిన్న తప్పుగా భావించే త్రిబుల్ రైడింగ్పై కూడా చర్యలు ఉన్నాయి. మొదటిసారి రూ.100 జరిమానా ఉండగా, రెండోసారి రూ.1000 వరకు పెరుగుతుంది.
18 ఏళ్లు నిండని వారు వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు. డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి కారణమైతే, మొదటిసారి రూ.2500 జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ జరిగితే రూ.25,000 జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. అంతేకాకుండా, వారికి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా నిషేధం కూడా ఉంటుంది.ఈ కొత్త ట్రాఫిక్ రైల్స్ ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లు పెంచడానికి తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని గుర్తుంచుకుని, ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని సూచించింది.
Read Also: కక్కుర్తి గాళ్లు.. రైళ్లలో బెడ్ షీట్లు, టవల్స్ ఎత్తేస్తున్న ప్రయాణికులు, ఆ డివిజన్లోనే అత్యధికం!