Online Railway Pass: దివ్యాంగులకు భారతీయ రైల్వే అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇకపై రైల్వే పాసుల కోసం రైల్వే ఆఫీసులు, రైల్వే స్టేషన్ల చుట్టూ తిరగకుండా ఆన్ లైన్ లోనే పొందే అవకాశం కల్పిస్తున్నది. ఇందుకోసం తాజాగా రైల్వేశాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ సౌకర్యం దివ్యాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక వెబ్ సైట్
దివ్యాంగులకు ప్రభుత్వం రాయితీపై ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నది. రైళ్లతో పాటు బస్సుల్లో వారికి ప్రత్యేక సీట్లు కేటాయించడంతో పాటు టికెట్లపై డిస్కౌంట్ అందిస్తున్నది. దివ్యాంగుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ప్రతి ఏటా పాసులను జారీ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ పాసులు తీసుకోవాలంటే తగిన పత్రాలు తీసుకుని రైల్వే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మారుమూల గ్రామాల ప్రజలు ఈ టికెట్ పొందేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దివ్యాంగులు ఇకపై ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్ ద్వారా పాసులు పొందేందుకు రైల్వేశాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. అంతేకాదు, అందులో ఈ-టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఈ వెబ్ సైట్ ద్వారా కొత్త వాళ్లు పాస్ తీసుకోవడంతో పాటు పాత పాసులను రెన్యువల్ కూడా చేసుకునే అవకాశం ఉంది.
ఆన్ లైన్ ద్వారా దివ్యాంగులు రైల్వే పాసులు ఎలా పొందాలంటే?
ఆన్ లైన్ ద్వారా రైల్వే పాసులు పొందాలనుకునే దివ్యాంగులు http:///divyangjanid.indianrail.gov.in అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఈ సైట్ ద్వారానే పాస్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ సైట్ లోనే యూనిక్ డిజబులిటీ ఐడీకార్డును రైల్వే అధికారులు జారీ చేస్తారు. కొత్త పాసులు కావాల్సిన వాళ్లు, పాత పాసులను రెన్యువల్ చేసుకునే వాళ్లు కూడా ఇక్కడి నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దివ్యాంగుల కోసం రైల్వేశాఖ తీసుకొచ్చిన వెబ్ సైట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. దివ్యాంగులు OTP సాయంతో నేరుగ ఆన్ లైన్ లోనే ఐడీ కార్డును తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ముందుగా పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ కోసం ఫోన్ నెంబర్ కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. అడిగిన పత్రాలు అప్ లోడ్ చేయాలి. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం, పాస్ మంజూరు అయ్యేలా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది.
దివ్యాంగుల సంతోషం
రైల్వేశాఖ తాజాగా తీసుకొచ్చిన ఈ విధానంతో కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయని దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ప్రయాణాల్లో తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా దివ్యాంగులు ప్రయాణించేందుకు ఈ పాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పాసుల వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది దివ్యాంగులు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
Read Also: గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాలకూ ఓ వందేభారత్ స్లీపర్.. ఏ రూట్లో నడుస్తుందంటే?