Indigo: భారీ వర్షాలతో ఉత్తర భారతం వణుకుతోంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పైలట్ ట్రాఫిక్లో చిక్కుకున్నాడు. ఫలితంగా విమానం లో గంటపాటు 175 మంది ప్రయాణికులు ఉండిపోయారు. చేసేదేమీ లేక మరొక పైలట్ని రంగంలోకి దించింది ఇండిగో సంస్థ.
భారీ వర్షాల నేపథ్యంలో విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ఊహించని సమస్య ఎదురైంది. భారీ వర్షం నేపథ్యంలో పైలట్ సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేదు. దీంతో ఆ విమానంలో దాదాపు గంటపాటు 175 మందికి పైగా ప్రయాణికులు ఉండిపోయారు.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు ఎయిర్లైన్స్ సంస్థ విచారణ చేపట్టగా భారీ వర్షాల వల్ల పైలట్ ట్రాఫిక్లో చిక్కుకుపోయినట్టే తేలింది. అందువల్ల ఆలస్యంగా వచ్చినట్లు తేలింది. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానం 6E 6131 రాత్రి 8.20 గంటలకు ఢిల్లీలోని టెర్మినల్ 1 నుండి బయలు దేరాల్సివుంది.
రాత్రి 9.10 గంటలకు జైపూర్ చేరుకోవాలి. చివరికి ఆ విమానం రాత్రి 9.09 గంటలకు బయలుదేరింది. ఆ విమానంలో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ వ్యవస్థాపకుడు హనుమాన్ బెనివాల్తోపాటు 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆలస్యంపై బెనివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో వాతావరణం- ట్రాఫిక్ సమస్యలను ఊహించి ముందుగా ఇంటి నుంచి బయలు దేరానని తెలిపారు.
పైలట్ ముందుగా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రయాణికులు కూర్చున్న తర్వాత విమానం కదలకపోవడంతో సిబ్బందిని అడిగినట్టు తెలిపారు. పైలట్ ఇంకా రాలేదని చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రయాణికులు ఎలాంటి గందరగోళం సృష్టించకుండా ఉన్నారని బెనివాల్ అన్నారు. చివరకు మరొక ఇండిగో విమానం ఢిల్లీకి వచ్చింది. ఆ విమానం పైలట్ను పంపించారని తెలిపారు.
ఈ వ్యవహారంపై ఇండిగో సంస్థ రియాక్ట్ అయ్యింది. భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిందని పేర్కొంది. ఊహించని పరిస్థితుల వల్ల విమానం బయలుదేరడం ఆలస్యమైందని వెల్లడించింది. ఈ విషయంలో ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు వివరణ ఇచ్చింది.
ALSO READ: 60 ఏళ్లు దాటిన మహిళలకు గుడ్ న్యూస్.. ఇర ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ