RailOne App Glitch: రైల్వే ప్రయాణికుల కోసం రూపొందించిన ‘రైల్ వన్’ టికెటింగ్ యాప్ లో షాకింగ్ బగ్ బయటపడింది. ఈ టెక్నికల్ సమస్య కారణంగా ప్రయాణికులు రైలులో ఎక్కిన తర్వాత కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. సాధారణంగా, జియో ఫెన్సింగ్ విధానం ద్వారా స్టేషన్ పరిధిలో ఉన్నప్పుడు మాత్రమే టికెట్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఉండాలి. కానీ, ఈ ఫీచర్ సరిగా పనిచేయకపోవడంతో చాలా మంది టికెట్ లేకుండానే ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
‘రైల్ వన్’ యాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసింది. దీని ముఖ్య ఉద్దేశ్యం స్టేషన్లలో రద్దీ తగ్గించడం, టికెట్ కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడం. అయితే, మార్చి నెల నుంచి ఈ యాప్ లో లోపం కనిపిస్తోందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ముంబై సబర్బన్ రైల్వే నెట్ వర్క్ లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు.
తాజాగా జరిగిన తనిఖీల్లో, కదులుతున్న లోకల్ రైలులోనే ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్న ఘటనలు బయటపడ్డాయి. కల్యాణ్ వైపు వెళ్లే ఏసీ లోకల్ రైలులో టికెట్ తనిఖీ సమయంలో ఇలాంటి ఘటనలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జియో ఫెన్సింగ్ వ్యవస్థ ఫెయిల్ కావడంతో ప్రయాణికులు రూల్స్ ను సులభంగా తప్పించుకుంటున్నారని వెల్లడించారు.
ఈ సమస్యపై రైల్వే యూజర్స్ కమిటీ సభ్యుడు రాజీవ్ సింఘాల్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రయాణికులు ప్లాట్ ఫారమ్ పై ఉన్నప్పుడు టికెట్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది. కానీ, రైలు బయలుదేరిన తర్వాత ఆ అవకాశం నిలిపివేయాలని సూచించారు. అయితే, సాంకేతిక పరిమితుల వల్ల ఇది పూర్తిగా నియంత్రించడం కష్టమని అధికారులు చెబుతున్నారు.
టికెట్ లేని ప్రయాణం పెరగడం వల్ల రైళ్లలో రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్ రైళ్లలో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. దీనివల్ల రైళ్ల టైమ్ మెయింటెనెన్స్ కూడా దెబ్బతింటోంది. ప్రతి రోజు సగటున 10 నుంచి 15 నిమిషాల ఆలస్యం అవుతున్నాయి. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ముంబై సబర్బన్ రైల్వేలోని మెయిన్ లైన్, హార్బర్ లైన్ ఈ సమస్య వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ట్రాక్ మరమ్మతులు, సిగ్నల్ సమస్యలు, అక్రమ ప్రవేశాలు, ముందస్తు సమాచారం లేకపోవడం లాంటి అంశాలు కూడా రైళ్ల ఆలస్యానికి కారణమవుతున్నాయి.
‘రైల్ వన్’ యాప్లో ఉన్న ఈ లోపాన్ని త్వరగా సరి చేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. లేకపోతే టికెట్ లేని ప్రయాణం పెరిగి, రైళ్లలో రద్దీ, ఆలస్యాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్ట్యా ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని నిపుణులు రైల్వే అధికారులకు సూచిస్తున్నారు.
Read Also: వందేభారత్ సూపర్ హిట్.. ఏడాదిలో ఎన్నికోట్ల మంది ప్రయాణించారంటే?