Hyderabad Traffic: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు తోడు ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రమవుతుందని. ఈ సమస్యకు రానున్న 30 నుంచి 40 ఏళ్లను దృష్టి లో పెట్టుకుని, వాహనదారులకు సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన హెచ్ సిటీ పనుల్లో భాగంగా నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ చుట్టూ రూ.1090 కోట్ల వ్యయంతో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ ల ఏర్పాటుకు ఇటీవలే జీహెచ్ఎంసీ పనులను మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. 2015లో రూపొందించిన ఈ ప్రతిపాదనలకు అనూహ్యాంగా అనేక రకాల అడ్డంకులేర్పడి, ఎట్టకేలకు ఇటీవలే మొదలైన పనులను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోపు ఈ ప్రాజెక్టు పనులను ముగించాలని సర్కారు నుంచి జీహెచ్ఎంసీకి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే ప్రస్తుతం కేబీఆర్ పార్కు చుట్టూ జరుగుతున్న హెచ్ సిటీ పనుల కారణంగా పార్కు చుట్టే గాక, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇకపై కేబీఆర్ పార్కు చుట్టున్న రూట్ లో వన్ వేను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు కూకట్ పల్లి వై జంక్షన్ లో కూడా హెచ్ సిటీ పనులను వేగవంతం చేసేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్దమవుతుంది. వై జంక్షన్ నుంచి అమీర్ పేట వైపు, అటూ మియాపూర్ వైపు రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణ ప్రతిపాదనలకు సంబంధించి స్థల సేకరణ చివరి దశలో ఉన్నందున, స్థల సేకరణ ముగిసిన చోట్ల పనులు చేపట్టారు.
కేబీఆర్ పార్కు చుట్టు జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తూనే, ఇంటిగ్రెటెడ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుంచి ఫిల్మ్ నగర్ మీదుగా టౌలీ చౌకీ మీదుగా పీవీఎన్ ఎక్స్ ప్రెస్ వేకు లింకుగా నిర్మించనున్న మరో ఫ్లై ఓవర్ కు సంబంధించి ఇంజనీరింగ్ వింగ్ ఫీల్డు లెవెల్ పరిశీలన జరుపుతున్నట్లు, త్వరలోనే ఈ పరిశీలన ముగిసిన తర్వాత డీపీఆర్ సిద్దం చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన మరో మోడల్ కారిడార్ షేక్ పేట-మాసాబ్ ట్యాంక్ మధ్య వెలసిన ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ కు సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీసు కమిషనర్ సమష్టిగా ఫీల్డు లెవెల్ లో పర్యటించిన సంగతి తెల్సిందే.
Also Read: ఈ కేసుతో నాకు సంబంధం లేదు… మంగ్లీ వివాదంపై డైరెక్టర్ క్లారిటీ!
మహానగరంలో పాదచారులు రోడ్డు దాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ముందుకు సాగటమే. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితమైన ఆదేశాల మేరకు ఫుట్ ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ఇటీవలే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సంగతి తెల్సిందే. పోలీసు బందోబస్తుతో చేపట్టిన ఈ డ్రైవ్ లో ఒక్క రోజులోనే సుమారు 780 ఫుట్ ఆక్రమణలను తొలగించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. కానీ పాతబస్తీలో కొందరు ప్రజాప్రతినిధులు ఆక్రమణల తొలగింపునకు అడ్డుకోవటంతో కేసులు కూడా నమోదైన పరిణామాన్ని జీహెచ్ఎంసీ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
ఒక వైపు ఆక్రమణల తొలగింపునకు సంబంధించి నేరుగా సీఎం ఆదేశాలు, మరోవైపు ఆక్రమణల తొలగింపునకు క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధుల నుంచి వత్తిళ్లు రావటంతో ఆక్రమణల తొలగింపుపై జీహెచ్ఎంసీ చాకచక్యంగా వ్యవహారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. నెలలో ఒక రోజు ఎవరికెలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి సమన్వయం కోసం ఇప్పటికే పలు సార్లు పోలీసు శాఖతో కూడా సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. నెలకు ఒక రోజు నగరంలో ఎక్కువ ఫుట్ పాత్ ఆక్రమణలున్న ప్రాంతాలను గుర్తించి, మొత్తం జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది అక్కడే విధులు నిర్వర్తించి అనుకున్న స్థాయిలో ఆక్రమణలను తొలగించేలా వ్యూహాన్ని సిద్దం చేయనున్నారు.