Indian Railways Tickets Booking: నిత్యం రైల్వే ద్వారా కోట్లాది మంది ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకరమైన ప్రయాణం చేస్తారు. చాలా మంది ప్రయాణానికి ముందే రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ, కొంత మంది అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారికి తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, చివరి నిమిషంలో జర్నీ చేయాల్సిన వారికి రైల్వే సంస్థ చక్కటి అవకాశాన్ని అందిస్తున్నది. రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందుకు కూడా టికెట్ బుక్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నది. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
‘కరెంట్ టికెట్ సిస్టమ్’తో అప్పటికప్పుడు టికెట్ల బుకింగ్!
గతంలో ఛార్ట్ ప్రిపేర్ కావడానికి కొద్ది గంటల ముందు వరకు కన్ఫర్మ్ టికెట్ పొందే వీలు ఉండేది. కానీ, ఇప్పుడు భారతీయ రైల్వే సంస్థ ‘కరెంట్ టికెట్ సిస్టమ్’ అనే సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రైలు బయల్దేరడానికి కేవలం 5 నిమిషాల ముందు కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం కల్పిస్తున్నది. వాస్తవానికి పలు కారణాలతో ప్రయాణానికి కొద్ది సేపటి ముందు కూడా కొంత మంది ప్రయాణీకులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ ఖాళీలను అవసరం అయిన ప్రయాణీకులు అందించేందుకు రైల్వేశాఖ ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వే సంస్థ రెండు ఛార్ట్ లను రూపొందిస్తున్నది. ఫస్ట్ ఛార్ట్ అనేది రైలు బయల్దేరడానికి 3 నుంచి 4 గంటల ముందు రెడీ చేస్తారు. రెండో ఛార్ట్ రైలు బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందు సిద్ధం చేస్తారు.
చివరి నిమిషంలో టికెట్ ఎలా పొందాలంటే?
‘కరెంట్ టికెట్ సిస్టమ్’ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వాళ్లు ముందు ఆ రైళ్లో బెర్తులు ఖాళీగా ఉన్నాయో? లేదో? తెలుసుకోవాలి. ఇందుకోసం ముందుగా IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ ను ఓపెన్ చేయాలి. ట్రైన్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. ఛార్ట్ వెయికెన్సీ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లిస్టు మీద్ క్లిక్ చేయాలి. మీరు వెళ్లాల్సిన రైలు పేరు, నెంబర్, ఎక్కాల్సిన స్టేషన్ వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ‘గెట్ ట్రైన్ ఛార్ట్’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీరు కోరుకున్న రైల్లో ఉన్న ఖాళీ సీట్ల వివరాలను డిస్ ప్లే అవుతాయి. క్లాసుల వారీగా అంటే.. ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఛైర్ కార్, స్లీపర్ క్రమంలో ఖాళీ సీట్లు కనిపిస్తాయి. బెర్త్ లు ఖాళీగా ఉంటే మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్లు లేకపోతే జీరో డిస్ ప్లే అవుతుంది. రైలు ప్రారంభం అయ్యే స్టేషన్ తో పాటు మరో రెండు స్టేషన్లలో ఎక్కే వారికి విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ‘కరెంట్ టికెట్ బుకింగ్’ టైమ్ లో కేవలం కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే బుక్ చేయబడుతాయి. సీనియర్ సిటిజన్లతో పాటు దివ్యాంగులకు రాయితీలు లభిస్తాయి.
Read Also: 57 రైళ్లకు హాల్టింగ్, తెలుగు ప్రయాణీకులు రైల్వే గుడ్ న్యూస్, ఏ ఏ స్టేషన్లలో ఆగుతాయో తెలుసా?