China Silver Trains: చైనాలో సీనియర్ సిటిజన్స్ జనాభా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి ద్వారా దేశ ఆర్థిక ప్రగతి పెంచుకునేలా డ్రాగన్ కంట్రీ చర్యలు చేపట్టింది. వృద్ధ పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం సిల్వర్ రైళ్లను పరిచయం చేసింది. సరికొత్త రైల్వే నెట్ వర్క్ ద్వారా దేశంలోని సీనియర్ సిటిజన్స్ ను పర్యాటక ప్రాంతాలకు తిప్పుతూ ఆర్థిక బలోపేతం కోసం ప్రయత్నిస్తోంది.
సీనియర్ సిటిజన్స్ కు అనుకూలంగా ఏర్పాట్లు
చైనా అందుబాటులోకి తీసుకురాబోతున్న సిల్వర్ రైళ్లు వృద్ధ ప్రయాణీకులకు అనుగుణంగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. ఈ రైళ్లలో ప్రత్యేక సీటింగ్ సదుపాయాలు, వైద్య సౌకర్యాలు ఉంటాయి. వృద్ధ ప్రయాణీకుల ఆసక్తులు, శారీరక సామర్థ్యాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. చైనాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరడంతో పాటు వాళ్లు ఖర్చు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక రైళ్లును ప్రారంభించనుంది చైనా.
వృధ్దుల ఖర్చుతో దేశ ఆర్థిక బలోపేతం
చైనాలో వృద్ధుల జనాభా వేగంగా విస్తరిస్తోంది. 2035 నాటికి ఈ సంఖ్య 400 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గత తరాల మాదిరిగా కాకుండా వృద్ధులు ఎక్కువగా డబ్బును ఖర్చు చేసే పరిస్థితిలో ఉన్నారు. అదే సమయంలో విశ్రాంత సమయంలో ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని పర్యాటక ప్రాంతాలను తిప్పడంతో పాటు మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు వీడి డబ్బుల ద్వారా ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది చైనా సర్కారు. సీనియర్ సిటిజన్లకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా.. వారి జీవన నాణ్యతను పెంచడమే కాకుండా వారి ఖర్చులను కూడా ప్రోత్సహిస్తోంది.
సిల్వర్ రైళ్ల ప్రత్యేకతలు
సిల్వర్ రైళ్ల ద్వారా సీనియర్ సిటిజన్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది చైనా. వీటిలో కొన్ని రైళ్లు దేశంలోని అన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలిపేవి కాగా, మరికొన్ని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. ఎక్కువ మంది వృద్ధులను ఈ రైళ్ల ద్వారా ఆకర్షించడమే ప్రత్యేక లక్ష్యంగా పెట్టుకున్నది చైనా ప్రభుత్వం. వీటి ద్వారా ఎక్కువ మంది సందర్శకులను తీసుకురావడంతో పాటు చిన్న నగరాల్లో వ్యాపారాలకు మద్దతు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని భావిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ స్నేహపూర్వక సేవలకు డిమాండ్ పెరిగే కొద్దీ ఈ ప్రాజెక్ట్ పర్యాటకం, ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఉపాధిని కూడా సృష్టిస్తుందని చైనా సర్కారు భావిస్తున్నది.
సిల్వర్ రైళ్లకు సీనియర్ సిటిజన్స్ నుంచి అనూహ్య స్పందన
చైనా అందుబాటులోకి తీసుకురాబోతున్న సిల్వర్ రైళ్లకు సీనియర్ సిటిజన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. చివరి రోజుల్లో ఆహ్లాదకరంగా అన్ని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన అన్ని రైళ్లలో బుకింగ్స్ ముందస్తుగానే పూర్తవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ నిర్ణయం ద్వారా సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు దేశ ఆర్థికపరిస్థితి మెరుగు పరిచేలా ఉందంటూ చైనాపై ప్రశంసలు కురుస్తున్నాయి.