Swiggy Food Delivery Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త! ట్రైన్ ప్రయాణంలో ఆహారం డెలివరీ కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ (Swiggy) ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రైలు ప్రయాణంలో ఫుడ్ డెలివరీ చేయడం అనేది తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద స్విగ్గీ ఈ సేవలు ప్రారంబించింది. అయితే ఆ సమయంలో ఎంపిక చేసిన కేవలం 4 స్టేషన్లకు (బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ) మాత్రమే ఈ సేవలు అందించింది. అయితే తాజాగా ఈ సేవలను దేశంలో 20 రాష్ట్రాలలోని 100 రైల్వే స్టేషన్లకు స్విగ్గీ విస్తరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
దీంతో ఇకపై స్విగ్గీ ద్వారా రైలు ప్రయాణికులు 60,000 కంటే ఎక్కువ బ్రాండ్ల నుంచి, దేశవ్యాప్తంగా 35 కంటే ఎక్కువ వంటకాల నుంచి, 7 మిలియన్లకు పైగా మెనూ ఐటెమ్ల నుంచి ఎంచుకోవచ్చు. “నిజానికి రైలు ప్రయాణం అనేది భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైపోయింది. ఈ ప్రయాణంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రైళ్లలో స్విగ్గీ ఫుడ్ను 100 స్టేషన్లకు విస్తరించడం వల్ల ప్రయాణీకులకు ఎక్కువ సౌలభ్యంగా ఉంది. అలాగే, ప్రయాణికులు విభిన్న రకాల భోజనాలను రుచి చూసే అవకాశం లభించింది” అని ఈ సందర్భంగా స్విగ్గీ ఫుడ్ మార్కెట్ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ అన్నారు.
Also Read: భలే.. జస్ట్ వాయిస్ కమాండ్తో నచ్చిన సీటు బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!
కాగా, రైళ్లలో ఆహారాన్ని అందించడానికి ఐఆర్సీటీసీతో మార్చి 2024లో స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణికులు తాము ఎక్కడైతే ఫుడ్ డెలివరీ చేసుకోవాలనుకుంటున్నారో, ముందు స్టేషన్లోనే స్విగ్గీ నుంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. స్విగ్గీతోపాటు జొమాటో ఫుడ్ డెలివరీ కూడా ఇదే తరహా సేవలను రైల్వే స్టేషన్లలో అందిస్తోంది. ఈ రెండు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు ప్రస్తుతం కలిపి ప్రతి రోజు లక్షకు పైగా ఫుడ్ ఆర్డర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత సంవత్సరం అంటే 2024లో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థ కేవలం 60 సెకన్ల హాల్ట్తో రైలు ప్రయాణికులకు 35,000 ఆర్డర్లను డెలివరీ చేసింది. దాదాపు 54,000 మంది ప్రయాణికులు ఒకే ట్రిప్లో మల్టీ మీల్స్ ఆర్డర్ చేశారు. విజయవాడ జంక్షన్ గత సంవత్సరంలో అత్యధిక ఆర్డర్లను నమోదు చేసింది. ముఖ్యంగా ముంబైలోని కళ్యాణ్ జంక్షన్లో ప్రయాణికులు అతిపెద్ద ఆర్డర్ చేశారు. ఇందులో 41 బర్గర్లను ఆర్డర్ చేయడం విశేషం.
స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది. దానిలో పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేసి, కావలసిన ఆహారాన్ని కావలసిన స్టేషన్లో డెలివరీ పొందొచ్చు. ఐఆర్సిటసితో ఈ ఒప్పందం ద్వారా ప్రయాణికులు మరింత మధురమైన అనుభవాన్ని పొందుతారని ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ గతంలో పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికుల నుంచి మేము అందిస్తున్న సేవలకు మంచి స్పందన వస్తోందని ఈ సందర్భంగా స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ పేర్కొన్నారు. దీని ద్వారా మరిన్ని స్టేషన్లకు సేవలు విస్తరించేందుకు తమకు అవకాశం లభిస్తుందన్నారు. త్వరలోనే మరిన్ని రైల్వే స్టేషన్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.