TGSRTC Special Buses: మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2243 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 శాతం వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.
ఈ నెల 14 నుంచి 16 తేదీ వరకు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 నుంచి 17వ తేదీ వరకు సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్ లను సంస్థ ఏర్పాటు చేస్తోంది. శివరాత్రి పండుగకు శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంస్థ వీసీఅండ్ ఎండీ వై.నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. గత శివరాత్రి కంటే ఈసారి 208 బస్సులను అదనంగా సంస్థ నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Naagin Rumours: పాములా మారిన యువతి? బెడ్పై 5 అడుగుల కుబుసం.. గ్రామంలో తీవ్ర గందరగోళం!
మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యధావిధిగా అమల్లో ఉంటుందని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు. కాగా, హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించారు. టికెట్ల బుకింగ్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చని, మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ 040 – 69440000, 040 – 234500332లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
Also Read: KTR Allegations: ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం’.. కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కేటీఆర్