India Bullet Train Trials: భారత్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది మే లేదంటే జూన్ నాటికి హైస్పీడ్ రైలు పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభమైన తర్వాత సుమారు రెండు నుంచి నాలుగు నెలల పాటు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తైన తర్వాత ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది.
వడోదరలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. దేశంలోనే తయారు చేస్తున్న బుల్లెట్ రైలు కోసం తొలి బాడీ ఫ్రేమ్ సిద్ధమైందని చెప్పారు. ప్రస్తుతం దాన్ని స్క్వీజ్ టెస్ట్ కోసం పంపినట్లు వెల్లడించారు. రైలు తయారీతో పాటు దేశంలోని రైల్వే మౌలిక సదుపాయాలను కూడా వేగంగా అప్ డేట్ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఎక్కువ సమయం తీసుకునే ముంబై-వడోదర ప్రయాణాన్ని బుల్లెట్ రైలు భారీగా తగ్గించనుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సుమారు గంటన్నరకు తగ్గే అవకాశం ఉందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే ఈ కారిడార్లో ప్రయాణించే వారికి సమయం భారీగా ఆదా అవుతుంది. ముఖ్యంగా ముంబై, గుజరాత్ ప్రాంతాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీకి ఉపయోగపడనుంది.
బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగమైన సూరత్-వాపి సెక్షన్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. పరీక్షలు, భవిష్యత్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అనుగుణంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. దేశంలో హైస్పీడ్ రైలు నెట్వర్క్ను విస్తరించే పెద్ద ప్రణాళికలో మరో ముఖ్యమైన అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.
బుల్లెట్ రైలు ప్రాజెక్టుతో పాటు సాధారణ రైల్వే వ్యవస్థలోనూ అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు రైల్వే మంత్రి వివరించారు. మెయింటెనెన్స్ విధానాలు, రిజర్వేషన్ వ్యవస్థలను మరింత ఆధునికంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత నిర్మాణ పద్ధతుల్లో మార్పులు చేసి పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. వివిధ అవసరాలకు అనుగుణంగా కొత్త రకాల వ్యాగన్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఉప్పు రవాణా కోసం ప్రత్యేక డిజైన్తో వ్యాగన్ను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. వందే భారత్ టెక్నాలజీ ఆధారంగా సరుకు రవాణా రైళ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా 280 రైల్వే స్టేషన్లను రీ డెవలప్మెంట్ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే 36,000 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ల అభివృద్ధి చేపట్టినట్లు వెల్లడించారు. చీనాబ్ వంతెన, మిజోరాం రైల్వే లైన్ లాంటి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవడం భారత రైల్వేలో వచ్చిన మార్పులకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకొచ్చారు.
Read Also: ఢిల్లీలో రైళ్లకు బ్రేక్.. ఏకంగా 110 సర్వీసులపై ఎఫెక్ట్.. కారణం ఏంటంటే?