Sahibzada Farhan On Bumrah: పాకిస్తాన్ (Pakistan) ఆటగాళ్లు నిత్యం వివాదాల్లో చిక్కుకుంటారన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తమ ప్రదర్శనకు మించి, స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. లేటెస్ట్ గా వెస్టిండీస్ పై టెస్టు మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పాకిస్తాన్ క్రికెటర్లు.. సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్న సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) కూడా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు టీమిండియా జట్టుపై ఆడడం అంటే ఎంతో ఇష్టమని ప్రకటించారు. టీమిండియా బౌలర్లకు నరకం చూపించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని.. ముఖ్యంగా యార్కర్ల కింగ్ బుమ్రాను ఇరగదీయడం అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. ప్రతిసారి ఇండియాతో మ్యాచ్ జరగాలని తాను నిత్యం అల్లాను ప్రార్థిస్తానని కామెంట్స్ చేశారు. దీంతో సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ డేంజర్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అద్భుతంగా ఆడతాడు అన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 సందర్భంగా కూడా టీమిండియాను ఊచకోత కోశాడు. బూమ్ బూమ్ బుమ్రా బౌలింగ్ లో కూడా సిక్సర్లు కొట్టాడు. అయితే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాజాగా కీలక ప్రకటన చేశాడు. భారత బౌలర్లకు షాక్ ఇవ్వడం తనకు ఎంతో ఇష్టమని.. అందులోనూ బుమ్రాను ఎదుర్కోవడం తనకు ఆనందాన్ని ఇస్తుందని వెల్లడించారు. టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం మంచి మజా ఇస్తుందని పేర్కొన్నారు.
బుమ్రా ఒక్కడే కాదు, టీమిండియాలో చాలా మంది అద్భుతమైన బౌలర్లు ఉన్నారని గుర్తు చేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి ఇతర నాణ్యమైన బౌలర్లు కూడా తనకు నచ్చుతారన్నారు. వారిని ఎదుర్కోవడం కూడా పెద్ద సవాల్ గా ఉంటుందని స్పష్టం చేశారు. ఆసియా కప్ 2025 సందర్భంగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోవడం ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. కానీ ఆ టోర్నమెంట్ సందర్భంగా బుమ్రా బౌలింగ్ లో మూడు సిక్సర్లు మాత్రం తన కెరీర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలిచాయని వెల్లడించారు. బుమ్రా బౌలింగ్ లో ఎన్నిటికైనా 6 సిక్సర్లు కొడతానంటూ సవాల్ విసిరారు సాహిబ్జాదా ఫర్హాన్.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు ఎక్కువగా నిర్వహిస్తే బాగుంటుందని కోరారు. రెండు దేశాల మధ్య గొడవల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు కావడం చాలా దారుణమని వివరించారు. ఇప్పటికైనా బీసీసీఐ అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కలిసి.. ద్వైపాక్షిక సిరీస్ ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాలని కోరారు. వైట్ బాల్ క్రికెట్ ఆడితే బెస్ట్ అన్నారు. రెండు జట్ల మధ్య టెస్టులు జరిగితే పెద్దగా ఆసక్తి ఉండదని అభిప్రాయపడ్డారు సాహిబ్జాదా ఫర్హాన్.