Vande Bharat Express News: భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేసిన వందేభారత్ రైళ్లు.. రోజు రోజుకు అప్ డేట్ అవుతూ.. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నది. ఈ రైళ్లు ప్రారంభం అయిన అన్ని రూట్లలో నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల సీట్లు దొరక్క ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 8 కోచ్ లతో నడిచే రైళ్ల స్థానంలో 20 కోచ్ ల రైళ్లను తీసుకురావాలని భావిస్తున్నది. త్వరలో 8 కోచ్ ల రైళ్ల స్థానం 20-కోచ్ వెర్షన్ రైళ్లు భర్తీ చేయనుంది.
తొలుత తిరువనంతపురం-మంగళూరు రూట్ లోకి..
దేశంలో తొలి 20 కోచ్ ల రైలు ఇప్పటికే ప్రారంభం కాగా, రెండో రైలును తిరువనంతపురం- మంగళూరు రూట్ లో పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం ఈ రూట్ లో 8 కోచ్ ల వందేభారత్ రైలు నడుస్తున్నది. ఈ రైలు ప్రారంభం అయినప్పటి నుంచి 100 శాతం అక్యుపెన్సీతో నడుస్తున్నది. సీట్లు లేక చాలా మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 20 కోచ్ రైలును పరిచయం చేయబోతున్నారు. అప్ గ్రేడ్ చేసిన రైలులో మొత్తం 1,246 సీట్లు ఉంటాయి.
మరికొన్ని రూట్లలోనూ..
అటు తిరునెల్వేలి-చెన్నై మార్గంలో నడిచే ఎనిమిది కోచ్ల వందే భారత్ రైలును కూడా కొత్తగా ప్రవేశపెట్టిన 20-కోచ్ వెర్షన్ తో భర్తీ చేయనున్నట్లు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేరళలోని తిరువనంతపురం-కాసరగోడ్ మార్గంలో 16 కోచ్ ల రైలు నడుస్తున్నది. ఇందులో 1,016 సీటింగ్ కెపాసిటీ ఉన్నది. 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నది. దీని స్థానంలోనూ కొత్త రైలు రాబోతోంది. దేశ వ్యాప్తంగా అత్యధిక రద్దీ ఉన్న 17 రూట్లలో 20 కోచ్ ల రైళ్లను తీసుకురావాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వందేభారత్ రైళ్ల గురించి ఆసక్తికర విషయాలు
⦿ 20 కోచ్ లతో రాబోతున్న వందేభారత్ రైళ్లు తెలుపు-నీలం రంగు స్థానంలో బూడిద-నలుపు-ఆరెంజ్ కలర్ తో రానున్నాయి.
⦿ త్రివేండ్రం – మంగళూరు రైలు 8 గంటల 35 నిమిషాల పాటు ప్రయాణించనుంది. మొత్తం 620 కి.మీ దూరంలో తొమ్మిది హాల్ట్ లను కలిగి ఉంది.
⦿ దేశంలో తొలి 20 కోచ్ ల వందేభారత్ రైలును వారణాసి-న్యూ ఢిల్లీ మార్గంలో ప్రారంభించారు. దీని సగటు వేగం గంటకు 72 కి.మీ.
⦿ త్వరలో 24 కోచ్ల వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.
⦿ న్యూఢిల్లీ-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు త్వరలో ప్రారంభం కానుంది
⦿ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు నేరుగా వెళ్లే వందే భారత్ జనవరి 2025లో ప్రారంభమవుతుంది.
⦿న్యూఢిల్లీ- శ్రీనగర్ రైలు ఢిల్లీ నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరి ఉదయం 8 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఈ రైలు అంబాలా, లూథియానా, జమ్ము, కత్రా స్టేషన్లలో ఆగుతుంది. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోని ఎత్తైన రైల్వే బ్రిజ్జి మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ వంతెన ఎత్తు దాదాపు 359 మీటర్లు. పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది.
Read Also: 13 దేశాలను కలిపే ఏకైక రైలు, ప్రపంచంలో ఇదే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ!