Indian Railways: భారతీయ రైల్వే వ్యవస్థను వందేభారత్ రైళ్లు సమూలంగా మార్చివేశాయి. అత్యంత వేగంగా, మరింత కంఫర్ట్ గా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే, ఈ రైళ్లకు తరచుగా పశువులు ఎదురు రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాదు, పశువులు ఢీకొన్నప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడించాయి. సాంప్రదాయ లోకోమోటివ్ల కంటే తేలికైన వందేభారత్ ఇంజిన్ అధిక వేగం కారణంగా ఈజీగా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.
భద్రతా చర్యలు తప్పనిసరి అని ప్రకటన!
భారతీయ రైల్వే సంస్థ వందేభారత్ రైళ్ల వేగాన్నిగంటకు 160 కి.మీ. వేగంతో రైళ్లను నడపాలనే ప్రణాళికలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో, తాజాగా నివేదిక తక్షణ భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది. వీటిలో ప్రధానంగా మనుషులు, పశువులు ట్రాక్ మీదికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం హై-స్పీడ్ కారిడార్ల వెంట బలమైన ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలన్నది. రైతులు తమ పశువులను ట్రాక్లపై సురక్షితంగా తరలించడానికి వీలుగా సబ్వేలను నిర్మించాలని కమిషన్ సలహా ఇచ్చింది. ఇలాంటి మార్గాల్లో లెవల్ క్రాసింగ్ లను తొలగించాలని తాజా నివేదిక సిఫార్సు చేసింది.
వందేభారత్ రైళ్లు ఎక్కడ తయారవుతున్నాయంటే?
భారతీయ సెమీ హై స్పీడ్ ట్రైన్ సెట్లు అయిన వందే భారత్ రైళ్లు ప్రస్తుతం ICF చెన్నై, RCF కపుర్తల, MCF రాయ్ బరేలిలో తయారు అవుతున్నాయి. డిసెంబర్ 26, 2024 నాటికి, మొత్తం 136 వందే భారత్ సేవలు పనిచేస్తున్నాయి. 2024లో ఏకంగా 62 వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సుదూర ప్రయాణాల కోసం స్లీపర్ రేక్ లతో సహా కొత్త వేరియంట్లు రెడీ అవుతున్నాయి.
తరచుగా పశువులను ఢీకొంటున్న వందేభారత్ రైళ్లు
ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు తరచుగా పశువులను ఢీకొంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ అధునాతన ట్రైన్ సెట్ల భద్రత గురించి ఆయా సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధిక వేగంతో ప్రయాణించే సమయంలో ఇటువంటి ప్రమాదాలు జరిగితే పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉందని భద్రతా నివేదికలు హెచ్చరించాయి. ఈ రైళ్ల వేగాన్ని 130 నుంచి 160 కి.మీ.లకు పెంచడం వల్ల లోకో పైలట్లకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు లేని వందేభారత్ ప్రయాణాల కోసం తగిన తక్షణ చర్యలు అవసరం అయిన భద్రతా నివేదిక వెల్లడించింది. వందే భారత్ ట్రైన్ సెట్లు ముందు లోకో మోటివ్ కు బదులుగా ప్రొపల్షన్ ను ఏర్పాటు చేశాయి. ఇవి ముందు భాగంలో తేలికగా ఉండటం వల్ల పశువులు ఎదురయినప్పుడు పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
18 నెలల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ తయారీ
ఇక వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా పిలువబడే ట్రైన్ 18.. కేవలం 18 నెలల్లో అభివృద్ధి చేయబడింది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ- వారణాసి మధ్య ఈ రైలును ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రైలును పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.
Read Also: ఏప్రిల్ 26 వరకు ఆ రైళ్లన్నీ బంద్.. వెంటనే చెక్ చేసుకోండి!