Visakhapatnam metro update: ఒక వైపు విశాఖ మోడ్రన్ సిటీగా ఎదగాలని ప్రభుత్వ లక్ష్యం.. మరోవైపు ఆ మార్పులకు ప్రజల సహకారం అవసరం. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు పునాది దశలోకి ప్రవేశించగా, దీనికి అవసరమైన భూముల కోసం అధికారులు నోటీసుల ప్రక్రియ వేగవంతం చేశారు. ఫేజ్ – 1 మెట్రో ప్రాజెక్టు కింద నగరంలో మూడు కారిడార్లకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ నడుస్తోంది. వీటి కోసం సంబంధిత భూ యజమానులకు ఫామ్ – 2 నోటీసులు పంపించేందుకు కలెక్టర్ సమీక్ష చేపట్టారు.
ఫార్మ్-2 నోటీసు అంటే ఏమిటి?
ఇది భూసేకరణ చట్టం ప్రకారం అవసరమైన అధికారిక ప్రక్రియలో భాగం. భూసేకరణ (Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act – 2013) ప్రకారం, ప్రభుత్వ అవసరాల కోసం భూమిని తీసుకోవాలంటే ముందుగా భూమి యజమానులకు నోటీసులు పంపించాలి. వాటిలో మొదటిది ఫామ్ – 1 కాగా, తరువాతి దశ ఫామ్ – 2. ఫామ్ – 2 ద్వారా భూమిని ఎందుకు అవసరమైందో, ఎన్ని చదరపు మీటర్ల భూమిని తీసుకోనున్నారో, భూమి యజమానుల హక్కులు ఏమిటో స్పష్టంగా తెలియజేస్తారు. అదే సమయంలో ఈ ప్రక్రియపై వారు అభ్యంతరం తెలిపే అవకాశం కూడా ఉంటుంది.
నోటీసులు రెడీ..
విశాఖ కలెక్టర్ శ్రీనివాసరాఘవన్ ఈ ప్రక్రియను సమీక్షిస్తూ అధికారులను స్పష్టంగా హెచ్చరించారు. ఫార్మ్- 2 నోటీసులను గడువులోగా పంపించి, భూ యజమానులతో చర్చలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇది చేయకపోతే ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మూడు కారిడార్లకు సంబంధించి మొత్తం ఎంత భూమి అవసరమో ఇప్పటికే ల్యాండ్ మ్యాప్ తయారైంది. ఇప్పుడు ప్రతి క్షేత్రస్థాయి స్థితిని పరిశీలించి, సంబంధిత భూములపై నోటీసులు అందజేయాల్సిన దశ వచ్చింది.
ఇక విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టును శాస్త్రీయంగా రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం ఇద్దరు కీలక సాంకేతిక భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంది. ఫ్రాన్స్కు చెందిన SYSTRA మరియు స్పెయిన్కు చెందిన TYPSA అనే రెండు అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో మేమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MoA)లు కుదిరాయి. SYSTRA సంస్థ విశాఖ మెట్రోకు, TYPSA సంస్థ విజయవాడ మెట్రోకు మార్గదర్శక పాత్ర పోషించనున్నాయి. వీరి సలహాలతోనే భూసేకరణ, మార్గాల ఎంపిక, టెక్నికల్ ఫీజిబిలిటీ మొదలైన అంశాలు వేగంగా ముందుకు పోతాయని అధికారులు ఆశిస్తున్నారు.
విశాఖ వాసులకిది ఒకవిధంగా ఊహించని మార్పే. బస్టాండు సమీపం నుంచీ గాజువాక దాకా వెళ్లే కారిడార్-1, నాడ కుప్పం వరకు సాగే కారిడార్-2, మధురవాడ దాకా కలిపే కారిడార్-3.. ఇవన్నీ కలిసి నగరానికి భవిష్యత్ మెట్రో ధోరణిని ఇస్తున్నాయి. అయితే ఈ మార్గాల్లోని ప్రజలకు, భూములు ఉన్నవారికి ఫామ్ – 2 నోటీసులు రావడం ద్వారా ఆందోళన ముడిపడుతోంది.
ఈ సందర్భంలో అధికారులు ప్రజలకు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. భూములు సేకరిస్తున్నాం కానీ తగిన నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తాం. అయితే కొన్ని కేసుల్లో వాదనలు, అభ్యంతరాలు రావడం సహజమే. వాటిని శాంతియుతంగా పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజల సహకారంతోనే మెట్రో సాధ్యమవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
ప్రజల మనోభావాలు, ప్రభుత్వ ప్రణాళికలు.. రెండూ సమన్వయమవ్వాలి. విశాఖ నగరం భవిష్యత్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థగా మెట్రో రూపుదిద్దుకుంటుంటే, ఆ మార్గంలో ఉన్న ప్రజలకు పూర్తి న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఫామ్ – 2 నోటీసులు తెచ్చే సందేహాలను సమాధానాలతో పరిష్కరించి, ప్రజా వ్యతిరేకత లేకుండా మెట్రో ప్రయాణం ముందుకు సాగితే.. విశాఖ నగరంలో అద్భుత మార్పు ఖాయమని చెప్పవచ్చు.