Train Ticket: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్. ప్రతిరోజూ లక్షలాది మంది రైలు మార్గాల ద్వారా ప్రయాణిస్తారు. సుదూర ప్రయాణాలకు రైల్వేలను ఉత్తమ రవాణా మార్గంగా పరిగణిస్తారు. నిజానికి.. భారతీయ రైల్వే చౌకైన ఎంపిక అని చెప్పవచ్చు. అందుకే అన్ని వర్గాల వారు రైల్వేలో సులభంగా ప్రయాణిస్తుంటారు. ఇదిలా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా భారతీయ రైల్వేలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
జనం ప్రయాణించేటప్పుడు ఎక్కడో ఒకచోట తమ టిక్కెట్లను పోగొట్టుకుంటారు. ఇలాంటి సమయంలో ప్రయాణం పెద్ద సమస్యగా మారుతుంది. టికెట్ పోగొట్టుకున్నప్పుడు ఏమి చేయాలో చాలా మంది ప్రయాణికులకు అర్థం కాదు. ఇంతకీ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏమవుతుంది? రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టికెట్ పోగొట్టుకుంటే ఏమి చేయాలి? అనే విషయాలకు సంబంధించిన సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్వే టికెట్ పోయింది- టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏమవుతుంది ?
మీ టికెట్ పోయి, టికెట్ లేకుండా ప్రయాణిస్తే, మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు తేలితే, అతడు తన టికెట్ రేట్ ఎంత అయితే ఉంటుందో.. దానికి రెట్టింపు జరిమానా చెల్లించాలి. ఒక వేళ జరిమానా చెల్లించకపోతే.. మిమ్మల్ని తరువాత వచ్చే స్టేషన్లో దింపివేసి, రైల్వే పోలీసులకు అప్పగిస్తారు.
ప్రయాణంలో టికెట్ పోగొట్టుకుంటే ఏమి చేయాలి ?
పిల్లలతో ప్రయాణించేటప్పుడు లేదా ఇతర కారణాల వల్ల తరచుగా ప్రయాణీకులు టిక్కెట్లను పోగొట్టుకుంటారు. ఇలాంటి సమయంలో మీరు టికెట్ లేకుండా ప్రయాణించే వారిగా పరిగణించబడరు. కానీ టికెట్ పోగొట్టుకుంటే మాత్రం TTE ని సంప్రదించాలి. మీ టికెట్ సంబంధిత సమాచారాన్ని TTEకి అందించడం ద్వారా.. మీరు మళ్ళీ మీ కోసం డూప్లికేట్ టికెట్ను పొందవచ్చు. కానీ ఇది ఉచితం కాదు. దీని కోసం.. మీరు కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా టికెట్ కోసం మీరు మీ కొన్ని గుర్తింపు కార్డులను కూడా చూపించాల్సి ఉంటుంది.
మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే.. ఆ టికెట్ను మీ మొబైల్లో చూసుకోవచ్చు. ఇందుకు మీకు డైప్లికెట్ కొనవలసిన అవసరం లేదు. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసిన తర్వాత.. మీరు మీ ఇ-టికెట్ను TTEకి చూపించడం ద్వారా వెళ్లాల్సిన చోటుకి ప్రయాణించవచ్చు.
ప్రయాణం మధ్యలో నేను టిక్కెట్లు కొనొచ్చా ?
మీరు అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితిలో ప్రయాణించాల్సి వచ్చి టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటే.. మీరు రైలు ఎక్కిన వెంటనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు TTEని సంప్రదించాలి. కానీ రైలులో సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ విధంగా ప్రయాణిస్తే, సాధారణ టికెట్ కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
రైలు ఆలస్యమైతే టికెట్ ఎప్పుడు వాపసు లభిస్తుంది ?
రైల్వే నిబంధనల ప్రకారం.. రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే.. టికెట్ మీరు తిరిగి వాపసు పొందవచ్చు. దీని కోసం మీరు TDR (టికెట్ డిపాజిట్ రసీదు) పొందవలసి ఉంటుంది.