రైల్వే ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న వందే భారత్ రైళ్ల(Vande Bharat Train)కు ఇప్పుడు భలే క్రేజ్ లభిస్తోంది. మిగతా రైళ్ల కంటే వేగంగా గమ్యానికి చేర్చేస్తున్న ఈ రైళ్లు.. ప్రయాణికుల టైమ్ను సేవ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అందుకే సుదూర ప్రయాణాల కోసం వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే సన్నహాలు మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో సాధారణ వందే భారత్ రైళ్లను నడపనున్నారు. అయితే.. ఇటీవల ఓ వందే భారత్ రైలు గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. గత నెల రోజులుగా ఆ వందే భారత్ రైలు రైల్వే స్టేషన్లోనే ఉండిపోయింది. ఇప్పటివరకు అది కదల్లేదు.. మెదల్లేదు. మరి ఇందుకు కారణం ఏమిటీ?
ఎక్కడ? ఎందుకు?
కేరళ(Kerala)లోని కాసర్గోడ్ జిల్లాలోని మంజేశ్వరం రైల్వే స్టేషన్కు ఈ మధ్య తాకిడి పెరిగింది. ప్రయాణికులతోపాటు స్థానికులు సైతం రైల్వే స్టేషన్కు వెళ్లి వచ్చేస్తున్నారు. ఎందుకా అని ఆరాతీస్తే ఓ విషయం తెలిసింది. అక్కడ వందే భారత్ రైలు ఒకటి ఆగి ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నెల రోజులుగా అక్కడే ఉంది. ఇంకేముంది స్థానికులంతా అక్కడికి వెళ్లి సెల్ఫీ తీసుకుని స్టేటస్లో పెట్టుకుంటున్నారు. కొందరు రీల్స్ చేసుకుని ఆనందిస్తున్నారు. అయితే, అందరి అనుమానం ఒకటే.. ఆ వందే భారత్ రైలుకు ఏమైంది? ఏదైనా సాంకేతిక సమస్య రావడం వల్ల అక్కడ నిలిపేశారా అని. కానీ అసలు విషయం అది కాదు.
అందుకే నిలిపేశారు..
మంజేశ్వరం రైల్వే స్టేషన్లోని కార్గో రైళ్ల పక్కన నాలుగో ట్రాక్పై వందే భారత్ రైలును పార్క్ చేశారు. దీనికి మొత్తం ఎనిమిది కోచ్లు ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి డ్యామేజీ లేదు. ఇంకా కొత్తగానే ఉంది. దీనిపై అధికారులను ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. దానికి ఎలాంటి రిపైర్ లేదని, స్టాండ్బైగా అక్కడ నిలిపి ఉంచామని తెలిపారు. దీనికి సమీపంలో ఉన్న మంగళూరు రైల్వే స్టేషన్ ఎప్పుడూ బీజీగా ఉంటుంది. దీంతో స్టాండ్ బై వందే భారత్ రైళ్లను నిలిపి ఉంచడానికి తగిన ప్లేస్ లేదు. అందుకే, ఆ రైలును మంజేశ్వరం రైల్వే స్టేషన్కు తరలించారు. ఇదివరకు ఈ రైలు తిరువనంతపురం – కాసరగోడ్ మార్గంలో నడిచింది. ప్రస్తుతం ఉన్న వందేభారత్ రైళ్లతో పోల్చితే ఇది పాతది. ప్రస్తుతం అప్గ్రేడెడ్ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అందుకే దీన్ని స్టాండ్ బైగా ఉంచారు.
స్టాండ్బైగా ఎందుకు?
మంగళూరు, కాసర్గోడ్-తిరువనంతపురం, మంగళూరు-గోవా మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్లకు ఇది స్టాండ్బైగా పనిచేస్తుంది. ఆ మార్గాల్లో ప్రయాణించే వందే భారత్ రైళ్లలో ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తినట్లయితే.. వెంటనే ఈరైలును అక్కడికి పంపిస్తారు. ఆయా రైళ్ల ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతమైతే అలాంటి అవసరం ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే.. అలప్పుజ ద్వారా అదే మార్గంలో 20 కోచ్ల రైలును, మంగళూరు నుంచి తిరువనంతపురం వరకు 16 కోచ్ల రైలును ప్రవేశపెట్టారు. దీంతో చాలామంది ప్రయాణికులు ఆ రైళ్లలోనే రాకపోకలు చేస్తున్నారు. దీంతో కొన్ని వందే భారత్ రైళ్లను మంగళూరు-గోవా మార్గానికి తిరిగి కేటాయించారు. అయితే, ప్రస్తుతం మంజేశ్వరంలో ఉన్న వందేభారత్ రైలు నిరుపయోగంగా ఉంది. అలా వదిలేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అందుకే దాన్ని చెన్నైకి తరలించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి అనుమతి లభిస్తే.. ఈరైలు చెన్నైలో సేద తీరనుంది.
Also Read: ఇండియన్ రైల్వే బిగ్ అప్డేట్.. ఇక నో టెన్షన్.. చార్ట్ టైమ్ మారిందోచ్!