TV Host:ఇటీవల కాలంలో సెలబ్రిటీలు బుల్లితెర, వెండితెర అని తేడా లేకుండా పాపులారిటీని సంపాదించుకోవడానికి అన్ని రంగాలలో అరంగేట్రం చేస్తూ ఆడియన్స్ కు మరింత చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ అని తేడాలు లేకుండా ప్రతి ఒక్క సెలబ్రిటీ దాదాపుగా ఓటీటీలో అడుగు పెడుతూ సత్తా చాటుతున్నారు. అంతే కాదు అవకాశం లభిస్తే టీవీ లోకి కూడా రావడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ముఖ్యంగా హోస్ట్ గా మారడానికి కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ స్టార్ హీరో హోస్ట్ గా మారబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని మొదలుకొని.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), నాగార్జున(Nagarjuna ), కమలహాసన్ (Kamal Haasan), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇలా ఎంతోమంది టీవీ షోలు చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ కి తెలుగులో నాగార్జున (Nagarjuna) హోస్ట్గా చేస్తున్నారు. అటు జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షోలో శ్రీకాంత్ (Srikanth) జడ్జిగా చేస్తున్నారు. అటు హిందీలో సల్మాన్ ఖాన్ (Salman Khan) నుంచి మొదలు పెడితే ఆ లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది.ఇప్పుడు ఆ జాబితాలోకి అజయ్ దేవగన్ (Ajay Devgan) చేయబోతున్నారు. అయితే ఈ హీరో చేయబోయే షో ఏమిటి? అందులో ఆయన రోల్ ఏమిటి? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన బుల్లితెర ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. హిందీ టీవీ షోలలో చాలా పాపులర్ అయి ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న ఇన్వెస్టిగేషన్ క్రైమ్ షో ‘క్రైమ్ పెట్రోల్’ కొత్త సీజన్ కి అజయ్ దేవగన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్ టీవీలో ఈ షో ప్రసారం కానుంది. వాస్తవానికి గత కొంతకాలంగా ఈ క్రైమ్ పెట్రోల్ కార్యక్రమానికి అనూప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆ స్థానం నుండి తప్పుకోవడంతో అజయ్ కొత్త సీజన్ కి హోస్ట్ గా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త సీజన్ కి ‘క్రైమ్ పెట్రోల్ 2026 : క్రైమ్ కా కరెంటు సీజన్’ అని పేరు పెట్టారు.
ALSO READ:కిమ్స్ హాస్పిటల్ నుండి ఎన్టీఆర్ డిశ్చార్జ్.. సర్జరీ తర్వాత తొలి ఫోటో!
ఈ క్రైమ్ పెట్రోల్ షోలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల గురించి, మారుతున్న నేరస్తుల ప్రవర్తన ధోరణి గురించి వివరించబోతున్నట్లు తెలుస్తోంది. “నేరస్తులు ఎప్పుడూ అపరిచితులు కాదు. చాలా సందర్భాలలో బాధితులకు తెలిసిన వారే నేరస్తులుగా మారుతున్నారు” అని తెలిపారు. ఇకపోతే ఇప్పటికే 15 ఎపిసోడ్ల చిత్రీకరణను ఆయన పూర్తి చేశారని.. వాటికి మంచి స్పందన వస్తే.. టీఆర్పి రేటింగ్ మరింత పెరిగితే అజయ్ దేవగన్ హోస్టుగా మరింత ముందుకు షోను తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం. మరి హోస్ట్ గా అజయ్ దేవగన్ రాక షోకి అదనపు బూస్ట్ అందించిందని చెప్పవచ్చు.