Brahmamudi serial today Episode: పందెంలో ఎలాగైనా గెలవాలనుకన్న రాజ్.. కావ్యను డిస్టర్బ్ చేయాలనుకుంటాడు. అందుకోసం కావ్యతో గొడవకు దిగుతాడు. తనను సీఈవో చాంబర్ లోకి వెళ్లనీయకుండా చేస్తాడు. దీంతో కావ్య బూతు బంగ్లా గురించి మాట్లాడుతుంది. అక్కడే ఉన్న శృతి మేడం బూతు బంగ్లా ఏంటి మీరు ఆ పేరు అన్నప్పుడల్లా సారు ఎందుకో కంగారు పడుతున్నారు అని అడుగుతుంది. కావ్య చెప్పబోతుంటే రాజ్ అడ్డుపడతాడు. సీఈవో చాంబర్ లోకి వెళ్లు అంటూ శృతికి ఎంప్లాయీస్ అందరిని మీటింగ్ కు పిలువు వాళ్లతో మాట్లాడాలి అని చెప్తాడు.
ఉద్యోగులు అందరూ మీటింగ్ కు వస్తారు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రప్పించాను అంటే రేపటి నుంచి పరధ్యాన శృంఖలాలు తెంచుకుని ఈ నియంతృత్వ పాలన నుంచి స్వాతంత్రం సంపాదించుకుని వెట్టి చాకిరి వ్యవస్థని సమూలంగా నిర్మూలించి రేపటి కోసం మన భవిష్యత్తు కోసం స్వేచ్చగా ఆఫీసులోకి అడుగుపెట్టే సమయం ఆసన్నం అయిందని చెప్పడానికి మీ అందరినీ రమ్మన్నాను అంటాడు రాజ్. దీంతో ఒక ఎప్లాయి రేపటి నుంచి మీరు ఆఫీసుకు రారా.. సార్ అని అడుగుతాడు. దీంతో రాజ్ కోపంగా రేయ్ ఎవర్రా ఆ కూత కూసింది అని గద్దిస్తాడు.
ఇంతలో కావ్య అసలు అందరినీ ఎందుకు రమ్మన్నారో తెలుగులో చెప్పండి అని అడుగుతుంది. తెలివి ఉన్నోళ్లకు అర్థం అవుతుంది. మన ఆఫీసులో గత కొన్ని రోజులుగా ఒక మహిళా అధికారం కింద పురుషుల ఉనికి తొక్కివేయబడుతుంది. అందుకే నేను ఒక ఉద్యమం లేవదీసాను. దాని ఫలితమే ఈ పందెం అని రాజ్ చెప్తూ తనకు కావ్యకు మధ్య సీఈవో విషయంలో ఇంట్లో జరిగిన సంఘటన గురించి చెప్తాడు. నేను గెలవాలని కోరుకునే వాళ్లంతా నాసైడు వచ్చి నిలబడండి అంటే ఎవ్వరూ రారు అందరూ కావ్య వైపే ఉంటారు.
దీంతో రాజ్ షాక్ అవుతాడు. వెంటనే సెక్యూరిటీని పిలిచి కొన్ని చీటీలు వాళ్లకు ఇప్పిస్తాడు. ఈ చీటీలలో నా పేరు ఈవిడ పేరు రాయించాను. మీరు తీసుకుని చీటీలలో మా పేర్లు ఉన్నాయి. అందులో ఎవరికి ఏ పేరు వస్తే వాళ్లు అటుసైడు వెళ్లాలి అని చెప్తాడు. చీటీలు ఓపెన్ చేసిన చూసిన ఉద్యోగులు సగం మంది రాజ్ వైపు వెళ్తారు. మిగతా సగం మంది కావ్య వైపు ఉండిపోతారు. దీంతో తన వైపు వచ్చిన ఉద్యోగులను మెచ్చుని బెస్ట్ డిజైన్ వేయడంలో మీరు కృషి చేయండి. నేను సీఈవోగా గెలిచాక మీకు బోనసులు ఇస్తానంటాడు.
అనామిక.. జగదీశ్ చంద్ర ప్రసాద్ దగ్గరకు వెళ్లి తాను సామంత్ గ్రూప్ కంపెనీకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అని చెప్తుంది. దీంతో అయితే నన్నెందుకు కలవాలనుకున్నారు అని అడుగుతాడు జగదీశ్. మీ ఊరిలో ఉన్న గుడిని పునర్నిర్మాణం చేస్తున్నారు అని తెలిసింది అని అనామిక చెప్తుండగానే జగదీశ్ అర్థమైంది. ఆ కాంట్రాక్ట్ మీ కంపెనీకి ఇవ్వమని అడగడానికి వచ్చారా..? కానీ నేను ఆ కాంట్రాక్ట్ ను స్వరాజ్ కంపెనీకి ఇచ్చాను అని చెప్పగానే.. అలా ఇచ్చి తప్పు చేశారని చెప్పడానికే వచ్చాను అంటుంది అనామిక.
తప్పు చేయడం ఏంటి..? ఇప్పుడు మార్కెట్ లో ఆ కంపెనీయే కదా నెంబర్ వన్ గా ఉంది కదా అంటాడు జగదీశ్. అందంతా ఒక్కప్పటి మాట సార్ రీసెంట్ గా బెస్ట్ డిజైనర్ అవార్డు కూడా మా కంపెనీకే వచ్చింది. దానికి కారణం ఏంటో తెలుసా..? ఆ ఇంట్లో గొడవలు. అంటూ తమ కంపెనీయే బెస్ట్ డిజైన్స్ ఇస్తుందని చెప్తుంది. దీంతో జగదీశ్ తనకు కొంచెం టైం కావాలని అడుగుతాడు. సరేనని ఎంత టైం అయినా తీసుకోండని కానీ బెస్ట్ డిజైన్స్ కావాలంటే మా కంపెనీకి రండి అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్లిపోతుంది.
అవకాశం కోసం కళ్యాణ్ రైటర్ లక్ష్మీకాంత్ దగ్గరకు వెళ్తాడు. కళ్యాణ్ చూసిన రైటర్ పక్కన కూర్చోబెట్టుకుని అన్ని కోట్లకు వారసుడివి అయినా కవిత్వం మీద నీకున్న ప్రేమను చూస్తుంటే ఉండలేకపోతున్నానని.. నీలాంటి వాడికి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్టు చెప్తాడు. దీంతో కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో రైటర్ కానీ ఒక్క కండీషన్. ఇంతకు ముందు నాతో చేసిన వాళ్లంతా వాళ్లు రాసిని పాటలే నేను వాడుకున్నానని బయటకు వెళ్లి నామీద ఆరోపణలు చేశారు. సో అలా కాకుండా నువ్వు నా దగ్గర మూడేండ్లు పని చేస్తానని. ఈ మూడేండ్లలో సొంతంగా ప్రయత్నాలు చేయనని అగ్రిమెంట్ రాసివ్వాలని అడుగుతాడు. కళ్యాణ్ సరేనని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి వెళ్లిపోతాడు.
రాజ్ తన వైపు వచ్చిన ఉద్యోగులతో మీటింగ్ పెట్టుకుని ఈ పందెంలో నేను గెలిచేలా డిజైన్స్ వేస్తే మీకు జీతాలు పెంచుతాను. జీవితాలు మార్చేస్తాను. ఇంక్రిమెంట్లు, బోనస్ లు అలాగే హౌసింగ్ సొసైటీ పెట్టి మీ సొంతింటి కలను కూడా నెరవేరుస్తానని పోలిటికల్ లీడర్ల లాగా హామీలు ఇస్తుంటాడు. చాటు నుంచి విన్న శృతి కావ్య దగ్గరకు వెళ్లి రాజ్ ఇస్తున్న హామీల గురించి చెప్తుంది. దీంతో కావ్య నేను సీఈవోగా బాధ్యతలు తీసుకున్నాను కానీ నేను కూడా నీలాగే ఎంప్లాయిని మాత్రమే. అద్బుతాలు జరగాలంటే మనం ఏవో గొప్ప పనులు చేస్తే సరిపోదు. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేస్తే చాలు అని చెప్తుంది.
దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. ఇంతలో ఇందిరాదేవి ధాన్యలక్ష్మీ రాలేదేంటని వంట మనిషిని అడుగుతుంది. పిలిచానమ్మా కానీ తనకు ఆకలిగా లేదని ముఖం మీదే తలుపు వేసింది అని చెప్తుంది. దీంతో ఆకలి లేకపోవడం కాదు ఆస్థి పంపకాలు చేయలేదన్న బాధ అయినా కొంచెం టైం కావాలిన చెప్పినా కూడా ఇలా చేయడం ఏంటని ఆలోచిస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.