TV: జెమినీ టీవీ ఛానెల్లో ఏ సినిమా లేదా ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ వచ్చినా.. ఒక గంభీరమైన బేస్ వాయిస్ మనందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఆ గొంతును వింటూ పెరిగిన మనకు, అసలు ఆ స్వరం వెనుక ఉన్న వ్యక్తి ఎవరనే సందేహం ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది. ఆ ప్రసిద్ధ గొంతు మరెవరిదో కాదు, ప్రముఖ నటుడు మరియు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ జెమినీ సురేష్ది. తాజాగా అయన తన టీవీ ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు .
జెమినీ సురేష్ జెమినీ టీవీ ప్రారంభం నుంచి వాయిస్ ఆర్టిస్ట్గా, యాంకర్గా సుదీర్ఘ ప్రయాణం చేశారు. జెమినీ టీవీలో వచ్చిన తొలి మేల్ యాంకర్ కూడా ఈయనే కావడం విశేషం. ఛానెల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రోగ్రామ్ టైమింగ్స్, ప్రమోషనల్ యాడ్స్, సినిమాల అనౌన్స్మెంట్స్ అన్నింటికీ ఆయనే తన సొంత గొంతును అందించారు.
పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..:
ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన సురేష్, తన వాయిస్ ఓవర్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సన్ జెమినీగా మారిన ఆ ఛానెల్లో ప్రసారమయ్యే అనేక కార్యక్రమాలకు వాయిస్ ఇచ్చింది తానేనని పంచుకున్నారు. ఆయన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గానే కాకుండా వెండితెరపై నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు.
నటుడిగా బిజీగా ఉన్న జెమినీ సురేష్ తాజాగా నటించిన చిత్రం ‘పాంచాలి పంచభర్తృక’. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని గంగ సప్తశిఖర తెరకెక్కించారు. ఇక ఈ నెల 14న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాలో జెమినీ సురేష్తో పాటు రోల్ రిడా, సరీ ఫర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.
దీంతో పాటు శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘బ్లాక్ మెయిల్’ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలోనూ సురేష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అద్భుతమైన స్క్రీన్ప్లేతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని సురేష్ ధీమా వ్యక్తం చేశారు.
కేవలం తన గంభీరమైన స్వరం ద్వారానే కాకుండా, వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ జెమినీ సురేష్ ప్రేక్షకులలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక వాయిస్ ఓవర్ రంగంలోనూ, సినిమాల్లో నటుడిగానూ ఆయన ఇలాగే విజయవంతంగా కొనసాగాలని, ముందుముందు మరిన్ని మంచి పాత్రలతో అలరించాలని కోరుకుందాం.
ALSO READ: కిమ్స్ హాస్పిటల్ లో జూ.ఎన్టీఆర్ కి శస్త్ర చికిత్స!