Road accident: కళ్లముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండ్రి గుండె పగిలింది. రాంగ్ రూట్లో వచ్చిన కారు తన బిడ్డను బలితీసుకుందని, ఏ తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదంటూ ఐశ్వర్య తండ్రి పాండు వ్యక్తం చేస్తున్న ఆవేదన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
హయత్నగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య అంత్యక్రియలు నేడు విషాదఛాయల మధ్య జరగనున్నాయి. రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు ఐశ్వర్య ప్రాణాలను బలిగొనడంతో ఆమె తండ్రి పాండు గుండె పగిలేలా రోదిస్తున్నారు. తనకు శస్త్రచికిత్స జరగడంతో రెండు రోజుల పాటు మార్చురీలోనే ఉన్న ఐశ్వర్య మృతదేహాన్ని, తండ్రి కోలుకోవడంతో మునగానూరులోని స్మశాన వాటికకు తరలించారు.
“నా బిడ్డ ఇక లేదనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఇంటికి వెళ్తే భార్యకు, కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో, వారిని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు” అంటూ పాండు కన్నీరుమున్నీరయ్యారు. తప్పు చేసిన డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషాదం మరే కుటుంబంలోనూ జరగకూడదని పాండు కోరుతున్నారు. రహదారులపై పెరుగుతున్న వాహనాల వేగం, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కుమార్తె మరణం వృథా కాకుండా ఇతరుల ప్రాణాలైనా కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.