Maharashtra Lovers: సాధారణంగా ప్రేమించిన వారు విడిపోవడం, లేదా ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలోని నాందేడ్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ప్రియుడిని కుటుంబ సభ్యులు హత్య చేసిన తర్వాత కూడా, ఆ యువతి తన ప్రేమను చంపుకోలేకపోయింది. హత్య జరిగిన తర్వాత కూడా, ఆ యువతి తన ప్రియుడి మృతదేహం (డెడ్ బాడీ) వద్దే పెళ్లి తంతును పూర్తి చేసుకుని, అతడిని తన భర్తగా స్వీకరించింది.
మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఓ యువతీ యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, కులాలు వేరు కావడంతో వీరి వివాహానికి ఇరువైపుల పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో, వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా? అంటూ ఆగ్రహించిన యువతి తండ్రి, ఆమె సోదరుడితో కలిసి యువకుడి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ యువకుడిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు హుటాహుటిన అతని ఇంటికి చేరుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రియుడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయింది, తీవ్రంగా రోదించింది. ఆమె తీవ్ర ఆవేదనతో… “కులాంతర వివాహానికి అడ్డుపడి, నేను ప్రేమించిన వ్యక్తిని మా నాన్న చంపేశారు. తను గెలిచానని, రాక్షస ఆనందం పొందుతున్నాడు. కానీ, అది ఎప్పటికీ జరగదు. నేను ఎవరినైతే ప్రేమించానో, వారి ఇంట్లోనే ఉంటాను” అని కన్నీటితో తెలిపింది.