Road Accident: తెలుగు రాష్ట్రాలను వరుస రోడ్డు ప్రమాదాలు కుదిపేస్తున్నాయి. నిన్నటి ఘటన మరవకముందే ఈ రోజు అదే రూట్లో మరో యాక్సిడెంట్ జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ వద్ద లారీ , ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తుంది బస్సు.. కరణ్ కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద మలుపు లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ప్రయాణికులు డ్రైవర్ను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన అనంతరం లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు. ఈ రోడ్డులో ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగడంతో వాహనదారులు తీవ్ర భయానికి గురవుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.