వరంగల్లో గంజాయి స్మగ్లర్ల పరారీ ఘటన కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్ గోడను దూకి ముగ్గురు స్మగ్లర్లు పారిపోవడం సీసీ టీవీ దృశ్యాల్లో నమోదు అయింది. స్టేషన్ నుంచి తప్పించుకున్న తర్వాత వారు డాల్ఫిన్ హాస్పిటల్ వద్ద ఒక బైకర్ను బెదిరించి బైక్ ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బందిపై రాళ్లతో దాడికి ప్రయత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది భయంతో వెనక్కు తగ్గారు. ఇంత సులభంగా నిందితులు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.