Raghavender Reddy: బిగ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ఛైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవేందర్ రెడ్డి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. జిల్లా సంవిధాన్ బచావో కమిటీ సభ్యులుగా సేవలు అందించారు.
ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సంతాపం తెలిపారు. రాఘవేందర్ రెడ్డి మరణం వారి కుటుంబానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నివాళులర్పించారు.
మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. విజయ్ రెడ్డి కుటుంబానికి ఈ కష్ట సమయంలో దేవుడు మనోబలాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. పాత్రికేయ లోకం సైతం బిగ్ టీవీ చైర్మన్ కుటుంబానికి అండగా నిలుస్తూ శ్రద్ధాంజలి ఘటించింది.