Hijab Verdict: హిజాబ్ ధరించటం ఇస్లామిక్ సంప్రదాయంలో విడదీయరాని భాగం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పాఠశాల యూనిఫాంతోపాటు అదనంగా హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ప్రయాగ్రాజ్కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి ఈ తీర్పును వెలువరించింది. వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే పాఠశాల నిబంధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. క్రమశిక్షణ, సమానత్వాన్ని కాపాడేందుకు పాఠశాలలు అమలు చేసే నియమ నిబంధనలే ఆమోద యోగ్యమని పేర్కొంది.
ప్రయాగ్రాజ్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన మైనర్ విద్యార్థిని అదే సంస్థలో 11వ తరగతిలో ప్రవేశం పొందడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తన పాఠశాల యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించేందుకు యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ ఆమె తన తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. 6వ తరగతి నుంచి తాను ఆ పాఠశాలలోనే చదువుకుంటూ హిజాబ్ ధరిస్తున్నానని, ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారంలో తప్పనిసరి అని తన పిటిషన్లో పేర్కొంది.
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ సమర్పించిన వివిధ తరగతుల ఫోటోలను పరిశీలించిన ధర్మాసనం.. సదరు విద్యార్థిని మినహా అదే మతానికి చెందిన ఇతర బాలికలు ఎవరూ హిజాబ్ ధరించకపోవడాన్ని గుర్తించింది. దీంతో ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారమనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ అంశం ఎక్కడ ఎదురైనా.. హిజాబ్ ధరించకపోవడం వల్ల మతం ప్రమాదంలో పడుతుందనే వాదనను, ఇది ఇస్లామిక్ విశ్వాసంలో విడదీయరాని భాగమనే అంశాన్ని వివిధ హైకోర్టులు ఏకగ్రీవంగా తోసిపుచ్చాయని స్పష్టం చేసింది.
ఏదైనా ఒక ప్రైవేట్ విద్యాసంస్థ అమలు చేసే డ్రెస్ కోడ్ పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా వర్తించినంత కాలం ఆ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసే పూర్తి అధికారాలు యాజమాన్యానికి ఉంటాయని హైకోర్టు పేర్కొంది. పాఠశాల యూనిఫాంను ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా పాటించాల్సిందేనని, వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా దానికి అదనంగా మరేదైనా జోడించడానికి చట్టపరమైన హక్కు ఉండదని తేల్చి చెప్పింది.
అందరికీ సమానంగా వర్తించే డ్రెస్ కోడ్ను ఒక్కొక్కరి అభిరుచికి అనుగుణంగా మార్చుకోవడానికి అనుమతిస్తే యూనిఫాం అనే భావనకే అర్థం లేకుండా పోతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా పాఠశాలల్లో క్రమశిక్షణను నిర్దేశించే అధికారం సంస్థ చేతి నుంచి విద్యార్థుల చేతికి మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Also Read: ఏడాదిలో ‘దేవాదుల’ పూర్తి.. రైతాంగానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీపి కబురు!
ఈ వివాదంపై పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ.. తమది స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రైవేట్ సంస్థ అని కోర్టుకు తెలిపింది. వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా తమ వద్ద చదువుకుంటున్నారని పేర్కొంది. ఒక విద్యార్థికి ప్రత్యేక మినహాయింపు ఇస్తే విద్యాసంస్థ క్రమశిక్షణ, యూనిఫాం సమానత్వం దెబ్బతింటాయని వాదించింది. కాగా, సదరు విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను యూపీ ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా వ్యతిరేకించడం గమనార్హం.
Also Read: కొండా సురేఖకు బిగ్ షాక్.. మంత్రి పదవి తీసేయాలని.. క్రమశిక్షణ కమిటీ నివేదిక!