Himachal Pradesh: దేశంలో ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని చోట్ల బహుభార్యత్వం సంప్రదాయంగా కొనసాగుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో బహుభర్తత్వం కొనసాగుతుంది. ఒకే వ్యక్తి ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ, ఓ ప్రాంతంలో ఒకే అమ్మాయి ఒకేసారి ఇద్దరు, లేదంటే ముగ్గురిని పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇంతకీ ఈ వింత సంప్రదాయం ఉన్న ప్రాంతం ఏదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తాజాగా ఇద్దరు యువకులను పెళ్లి చేసుకున్న యువతి
ఒకే యువతి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను పెళ్లి చేసుకునే ఈ సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్లోని ట్రాన్స్ గిరి ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా హట్టీ సమాజంలో ఈ వింత సంప్రదాయం ఉంది. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సిర్మౌర్ జిల్లాలోని షిల్లాయ్ గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే అన్నదమ్ములు.. కున్హాట్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. “ఇది మా ఉమ్మడి నిర్ణయం. భార్యను అన్నదమ్ములు పంచుకోవడం దశాబ్దాలుగా వస్తోంది. ఇది అన్నదమ్ముల మధ్య నమ్మకం, సంరక్షణ, ఉమ్మడి బాధ్యతకు సంబంధించిన విషయం. ఈ సంప్రదాయాన్ని ముందుకు కొనసాగించడం పట్ల సంతోషంగా ఉంది” అని కొత్త పెళ్లి కొడుకులు చెప్పుకొచ్చారు.
ఇష్ట పూర్వకంగా సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నా!
తనకు నచ్చి సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి చేసుకున్నట్లు వధువు సునీత వెల్లడించింది. “ఇలా పెళ్లి చేసుకోవాలనేది నా ఎంపిక. ఈ పెళ్లి గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదు. ఈ సంప్రదాయం నాకు తెలుసు. నేను ఇష్ట పూర్వకంగా కొనసాగించాలి అనుకున్నాను. మా అందరి జీవితాలు ఎంతో సంతోషంగా ఉంటాయని భావిస్తున్నాం” అని వివరించింది.
ఆ గ్రామంలో చాలా మందికి ఇద్దరు, ముగ్గురు భర్తలు
షిల్లాయ్ గ్రామంలో ఇప్పటి వరకు చాలా మంది ఇలా పెళ్లి చేసుకున్నా సైలెంట్ గా చేసుకునే వారు. కానీ, తొలిసారి బహిరంగంగా వైభవంగా ఈ పెళ్లి జరిగింది. “మా గ్రామంలోనే ఇద్దరు, ముగ్గురు సోదరులకు ఒక భార్య ఉన్నది. ఒక భర్తకు ఎక్కువ మంది భార్యలు కూడా ఉన్నారు. అలాంటి కుటుంబాలు మూడు డజన్లకు పైగా ఉన్నాయి. కానీ, ఈ పెళ్లిళ్లు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా జరిగాయి. తొలిసారి బహిరంగంగా ఈ వివాహం జరిగింది” అని షిల్లాయ్ కి చెందిన బిషన్ తోమర్ వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో, సమీప ప్రాంతాలకు చెందిన వందలాది మంది గ్రామస్తులు, బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తయారు చేసిన రుచికరమైన వంటకాలు అతిథులకు ఎంతగానో నచ్చాయి. ప్రజలు పహారీ జానపద పాటలకు ఆనందంగా నృత్యం చేస్తూ, వధువు, వరులిద్దరినీ ఆశీర్వదించారు.
ఎందుకు ఈ సంప్రదాయం?
ట్రాన్స్ గిరి ప్రాంతంలో బహుభర్తృత్వం దశాబ్దాలుగా ఉంది. ఏ స్త్రీ భర్త చనిపోయి వితంతువుగా మిగిలిపోకుండా చూసుకోవడం కోసం ఈ సంప్రదాయాన్ని పాటించారు. అంతేకాదు, సోదరులు ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా పంచుకోవడం ఈ సంప్రదాయాన్ని అనుసరించారు. కుటుంబాలు విడిపోకుండా కాపాడుకునేందుకు ఈ సంప్రదాయం ఉపయోగపడేది.
Read Also: కదిలే ఏసీ.. ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలోకి.. ఇతడి ఐడియాకు నిజంగా పిచ్చోళ్లైపోతారు!