రకరకాల కారణాలతో భార్య భర్తలు విడాకులు తీసుకుంటారు. కొంత మంది గొడవల కారణంగా విడిపోతే, మరికొంత మంది వేధింపుల కారణంగా సఫరేట్ అవుతారు. కలిసి ఉండలేం అనుకున్నప్పుడు విడిపోయి సంతోషంగా ఉండాలని భావిస్తారు. అందుకే, కోర్టుకు వెళ్లి చట్ట ప్రకారం విడాకులకు అప్లై చేసుకుంటారు. భార్య భర్తలు మళ్లీ కలిసేందుకు న్యాయమూర్తులు బోలెడు అవకాశాలు ఇస్తారు. కలిసి ఉండేందుకు అవసరమైన కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు. అప్పటికీ మారకుండా, కచ్చితంగా విడాకులే కావాలి అనుకుంటే, తప్పని పరిస్థితులలో డివోర్స్ మంజూరు చేస్తారు.
ఇక విడాకుల సందర్భంగా కోర్టులో ఇద్దరికి సంబంధించిన ఆస్తులు, పిల్లలు, భరణం గురించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. భర్త భార్యకు ఎంత ఆస్తి ఇవ్వాలి? నెల నెలకు ఎంత భరణం ఇవ్వాలి? ఒకవేళ ఇద్దరికి పిల్లలు ఉంటే వారు ఎవరి దగ్గర ఉండాలి? వారి మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటి? అనే అంశాలపైన కీలకంగా చర్చిస్తారు. అన్ని అంశాల్లో క్లారిటీ వచ్చిన తర్వాత చివరకు కోర్టు భార్యా భర్తలు వేరుగా ఉండేందుకు అంగీకరిస్తుంది. విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడిస్తుంది.
భార్యపై వింత రివేంజ్ ప్లాన్ చేసిన భర్త
కోయంబత్తూర్ కు చెందిన ఓ జంట విడాకులు తీసుకునేందుకు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. గత ఏడాది కాలంగా కేసు విచారణ జరుగుతుంది. కలిసి ఉండాలని ఎంత నచ్చజెప్పినా ససేమిరా అన్నారు. చివరకు న్యాయమూర్తి ఇద్దరికీ విడాకులు మంజూరు చేశారు. భార్యకు భరణంగా రూ. 2 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. తొలి వాయిదాగా రూ.80 వేలు ఇవ్వాలని తీర్పు వెల్లడించారు. అయితే, ఆ డబ్బులను భర్త నోట్ల రూపంలో కాకుండా నాణేలుగా తీసుకొచ్చాడు. వాటిని ఏకంగా 20 సంచులలో పట్టుకొచ్చాడు. నాణేలు లెక్కబెట్టలేక తన మాజీ భార్య పడే ఇబ్బందులను చూసి మురిసిపోవాలని భావించాడు.
20 సంచులలో చిల్లర తెచ్చిన భర్త
కారులో ఒక్కసారిగా 20 సంచులు తీసుకొచ్చేసరికి అక్కడి వాళ్లంతా షాకయ్యారు. కోర్టు సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. ఆ సంచులు చూసి భార్య కూడా షాకయ్యింది. ఈ వ్యవహారాన్ని చూసి న్యాయమూర్తి కోపంతో ఊగిపోయారు. కావాలనే ఇలా చేశావంటూ నిప్పులు చెరిగారు. ఆ చిల్లర తీసుకెళ్లి నోట్లుగా తీసుకురావాలని ఆదేశించారు. న్యాయమూర్తి కోపంతో అతడు చేసేదేమీ లేక ఆ చిల్లర సంచులను మళ్లీ కారులో పెట్టుకుని తీసుకెళ్లారు. వాటిని నోట్లుగా మార్చేందుకు కొంత సమయం అడిగినట్లు తెలుస్తున్నది. అందుకు జడ్జి కూడా అంగీకరించినట్లు సమాచారం.
Tamil Nadu: In a Coimbatore divorce case, the judge ordered the husband to pay two lakh rupees as alimony. Instead, he brought 20 bundles of one and two rupee coins. The judge advised him to exchange them for notes and adjourned the case. The husband then took the coins and left pic.twitter.com/j0SvhMPK6n
— IANS (@ians_india) December 19, 2024
జడ్జి తీవ్ర ఆగ్రహం
మొత్తంగా భార్యపై కోపాన్ని చిల్లరతో తీర్చుకోవాలని భావించినా, న్యాయమూర్తి నీళ్లు చల్లాడు. పైగా జడ్జి తన మీదే ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిరాశలో వెనుతిరిగాడు. ఆ చిల్లర డబ్బులను నోట్లుగా మార్చి ఇచ్చేందుకు , కొంత సమయాన్ని అడిగి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఇదేం ఆనందం రా బాబూ.. అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: రెండుసార్లు పుట్టిన ఒకే బిడ్డ.. ఆధునిక వైద్యశాస్త్రంలో అద్భుతం!